వెంగళరావునగర్ : కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి గుర్తుతెలియని ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ స్వరాజ్ నగర్కు చెందిన రహీం పాషా(38) ఉద్యోగం లేకపోవడంతో ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నాడు.
ఈ విషయమై తరచూ భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగేది. గొడవ జరిగినప్పుడల్లా రహీం ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి సాయంత్రం వస్తుండేవాడు. కాగా ఈ నెల 16న ఉదయం భార్యతో ఘర్షణ పడ్డాడు. మనస్తాపంతో ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లి గుర్తుతెలియని ద్రావణం తాగాడు.
అపస్మారక స్థితికి చేరిన బాధితుడిని కుటుంబ సభ్యులు ఉస్మానియా దవాఖానాకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రహీం పాషా మృతి చెందాడు. మృతుడి సోదరుడు షేక్ మహబూబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.