సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): నగరంలో రాత్రి వేళల్లో వరుస దోపిడీలు, దొంగ తనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన పాత నేరస్తుల ముఠాను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.88 లక్షల విలువైన సొత్తుతో పాటు ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బషీర్బాగ్లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు సీపీ విక్రమ్సింగ్ మాన్, టాస్క్ఫోర్స్ డీసీపీ ఓ(ఎస్డీ) రాధాకిషన్ రావుతో కలిసి వివరాలను వెల్లడించారు. నగరంలోని సైఫాబాద్, జూబ్లీహిల్స్, నారాయణగూడ, మహంకాళి పోలీస్స్టేషన్ల పరిధిలో అక్టోబర్ 3 నుంచి ఈనెల 5వ తేదీ వరకు వరుసగా నాలుగు దోపిడీలు జరిగాయి. నగల దుకాణాలు మూసి ఇంటికి వెళ్తున్న వారిని, బంగారు నగలు ఇతర దుకాణాలకు సరఫరా చేసే వారినే లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా దోపిడీలకు పాల్పడింది. తొలుత రెక్కీ నిర్వహించి, ఆ తర్వాత బాధితుల దృష్టి మళ్లించి, కళ్లల్లో కారం చల్లి దోపిడీలు చేస్తున్నారు. నేరగాళ్లను పట్టుకునేందుకు స్థానిక పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. నేరగాళ్లను గుర్తించారు.
జహనుమాకు చెందిన సయ్యద్ సయీద్ అలియాస్ లాంబపై 2014లో పీడీ యాక్టు ప్రయోగించారు. డిసెంబర్ 2017లో జైలు నుంచి బయటకు వచ్చాడు. అతడితో పాటు మిస్త్రీగంజ్లో ఉంటున్న సలీం అలియాస్ జబ్బా కూడా స్నాచింగ్, దొంగతనాలు చేస్తూ జైలుకు వెళ్లి, 2018లో బయటకు వచ్చాడు. ఈ ఇద్దరు కలిసి మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 500లకు పైగా స్నాచింగ్లు, దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. అత్తాపూర్కు చెందిన అవారు బాలకృష్ణ అలియాస్ కిషన్ అలియాస్ హజమ్ నగల దుకాణంలో పనిచేశాడు. హోల్సెల్ దుకాణాలకు బంగారం వచ్చి.. పోయే సమయం గూర్చి అతడికి అవగాహన ఉన్నది. దీంతో అతడిని తమ ముఠాలో చేర్చుకున్నారు. అతడితోపాటు మహ్మద్ అహదుద్దీన్, సయ్యద్ ముబషీర్ హుస్సేన్, మహ్మద్ గౌస్పాషా కూడా ముఠాలో చేరారు.
లాంబ ప్లాన్ చేస్తే, బాలకృష్ణ రెక్కీ నిర్వహిస్తాడు. బైక్లపై వెళ్లి బంగారం, డబ్బుతో వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేస్తున్నారు. బాధితుల దృష్టి మళ్లించి, కళ్లల్లో కారం పొడి చల్లి దోపిడీలు చేశారు. అక్టోబర్ 3న సైఫాబాద్, నవంబర్ 22న జూబ్లీహిల్స్, నవంబర్ 24న నారాయణగూడ, డిసెంబర్ 5న మహంకాళి పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ ముఠా దోపిడీలకు పాల్పడింది. ఈ ముఠాలో మహ్మద్ అహదుద్దీన్ మినహా మిగతా ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి వెండి, బంగారం, రూ.8 వేల నగదు తదితర వస్తువులతోపాటు రూ.88 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రఘునాథ్, శ్రీనాథ్రెడ్డి, సంతోష్కుమార్ బృందాలను అదనపు సీపీ అభినందించారు. ఈ సమావేశంలో సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.