Ramoji Film City | హైదరాబాద్ : రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఓ కంపెనీ సీఈవో మృతి చెందగా, ప్రెసిడెంట్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్ సిటీ ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదైంది.
ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్ వద్ద విస్టెక్స్ ఆసియా కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈ నెల 18వ తేదీ రాత్రి నిర్వహించింది. అయితే కంపెనీ సీఈవో సంజయ్ షా(56) అమెరికాలో ఉంటున్నారు. ఈ వేడుకల నిమిత్తం ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక సీఈవో సంజయ్ షా, ప్రెసిడెంట్ విశ్వనాథరాజు(52)ను క్రేన్ నుంచి కిందకు దించుతూ ఆహ్వాన ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వారిని కిందకు దించుతుండగా క్రేన్ తీగలు తెగిపోయాయి. దీంతో సంజయ్ షా, విశ్వనాథరాజు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
సంజయ్ షా మలక్పేటలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. విశ్వనాథ రాజు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విస్టెక్స్ ఆసియా కంపెనీ ఉద్యోగి జానకీ రాం రాజు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిగా రామోజీ ఫిల్మ్ సిటీ ఈవెంట్ మేనేజ్మెంట్ను చేర్చి దర్యాప్తు చేపట్టారు.