బంజారాహిల్స్,ఆగస్టు 12: ట్రాన్స్జెండర్లపై సమాజంలోని వివక్షను తొలగించడంతో పాటు ఫ్యాషన్ రంగంలో మక్కువ కలిగిన వారికి సరైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో ‘ఫ్యాషన్ టెర్రయిన్’ పేరుతో సెప్టెంబర్ 9న నగరంలో ఫ్యాషన్ షో నిర్వహించనున్నామని ఆర్వీ స్టూడియోస్ అధినేత వల్లభనేని గోపీచంద్ తెలిపారు.
శనివారం జూబ్లీహిల్స్లో నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో బిగ్బాస్ ఫేమ్ దివితో పాటు పలువురు ట్రాన్స్జెండర్లు పాల్గొని బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూఏఈ దౌత్యాధికారి షేక్ మాజిద్ రషీద్ అల్ మౌలా, అరుణశ్రీ, రాజీవ్, తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి ప్రధాన కార్యదర్శి మువ్వల చంద్రముఖి తదితరులు పాల్గొన్నారు.