సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): స్నాచింగ్లు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు.. ఇలాంటి అన్ని రకాల నేరాలను అదుపుచేసేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్ తెలిపారు. వాహనాల నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఎల్బీనగర్లోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్పెషల్ డ్రైవ్ వివరాలను వెల్లడించారు. ఈ స్పెషల్ డ్రైవ్ను మల్కాజిగిరి, ఎల్బీనగర్, భువనగిరి ట్రాఫిక్ ఏసీపీలు శ్రీనివాసరావు, అంజయ్య, సైదులు నేతృత్వంలో ఆయా ట్రాఫిక్ ఠాణాల సిబ్బంది, శాంతి భద్రతల పోలీసుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 34 చోట్ల ఉదయం, సాయంత్రం వేళల్లో డ్రైవ్ నిర్వహిస్తున్నామని, 233 మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 149 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మరో 815 మందిపై మోటర్ వాహనాల చట్టం కింద జరిమానాలు విధించామన్నారు.
నిబంధనల మేరకు నంబర్ ప్లేట్ కనిపించే విధంగా వాహనానికి ఏర్పాటు చేసుకోవాలన్నారు. నంబర్ ప్లేట్ను ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే తప్పనిసరిగా పోలీసులకు దొరికిపోతారని డీసీపీ హెచ్చరించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా నంబర్లను తొలగిస్తున్నారని, మరికొంతమంది నంబర్ ప్లేట్ను తారు మారు చేస్తున్నారని, ఇంకొందరైతే ట్రాఫిక్ ఈ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అతికిస్తున్నారని తెలిపారు. నిబంధనల మేరకు ప్రజలు తమ వాహనాలకు నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకొని, పోలీసులకు సహకరించాలని డీసీపీ కోరారు.