సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): గంజాయి స్మగ్లర్లపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే నగరంలో మత్తు ఆనవాళ్లు లేకుండా కొరఢా జుళిపిస్తున్న పోలీసులు.. తెలంగాణ మీదుగా ఇతర రాష్ర్టాలకు మత్తు పదార్థాలు తరలించే ముఠాలపై కూడా కన్నేసి వారి ఆట కట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాలను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.86కోట్ల విలువజేసే 910 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలను వెల్లడించారు.
బియ్యం తవుడుతో కప్పేసి..
హర్యానా ప్రాంతానికి చెందిన జీవన్సింగ్ లారీ డ్రైవర్. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయి రవాణా చేయడం ప్రారంభించాడు. జైపూర్కు చెందిన చంద్రశేఖర్ సూచన మేరకు చత్తీస్గఢ్కు చెందిన అంకిత్ సింగ్తో కలిసి డీసీఎంతో ఒడిశాలోని బోరిగుమ్మ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ 758 కిలోల గంజాయిని డీసీఎంలో లోడ్చేసి, ఎవరికీ కనిపించకుండా బియ్యం తవుడుతో కప్పేశారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో డెలివరీ చేసేందుకు జీవన్ సింగ్, అంకిత్ గంజాయి లోడ్తో ఉన్న డీసీఎంతో ఒడిశా నుంచి బయలుదేరి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర వెళ్తున్నారు. డీసీఎం సోమవారం ఉదయం జీడిమెట్ల పరిధిలోని షాపూర్ బస్టాప్ వద్దకు చేరుకోగానే విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి పట్టుకుని తనిఖీ చేయగా, బియ్యం తవుడు కింద గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. జీవన్సింగ్, అంకిత్సింగ్ను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.35 కోట్ల విలువైన 758 కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గాజుల డబ్బాల్లో పెట్టి..
మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన బాలు, ప్రదీప్ ఫకీర్ సిరసత్ గంజాయి కోసం ఒడిశాకు చెందిన మున్నాను సంప్రదించారు. గంజాయి విక్రయించేందుకు మున్నా అంగీకరించాడు. బాలు సూచన మేరకు అనిల్ శ్యామ్రావు సాల్వే(59), బాహు సాహిబ్ పిరాజి సాల్వే(43), కమల్ శివాజీ కండె (46), శాంతా బాయి పండి(52) ఈనెల 6న రైలు ద్వారా ఒడిశాలోని బెర్హంపూర్ ఏజెన్సీకి చేరుకున్నారు. మున్నా వద్ద 144 కిలోల గంజాయిని కొనుగోలు చేసి.. రెండేసి కిలోల చొప్పున ప్యాక్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ ప్యాకెట్లను గాజుల డబ్బాల్లో పెట్టి.. చుట్టూ గాజలుతో కవర్ చేశారు. నిందితులు ప్రైవేట్ వాహనంలో గంజాయిని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా.. సోమవారం ఉదయం శంషాబాద్ తొండుపల్లి వద్ద రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు, శంషాబాద్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. వారి వద్దనుంచి రూ. 43.20 లక్షల విలువైన 144 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మాదాపూర్ పరిధిలో..
బీదర్కు చెందిన శివాజీ కాశీనాథ్ చౌహాన్ ఉపాధి కోసం 2019లో నగరానికి వలస వచ్చాడు. సోమవారం ఉదయం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని నలగండ్ల ఎక్స్రోడ్ వద్ద గంజాయి విక్రయిస్తుండగా మాదాపూర్ ఎస్ఓటీ, చందానగర్ పోలీసులు శివాజీని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.2.40లక్షల విలువజేసే 8 కిలోల గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠాలను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా సీపీ అభినందించారు. ఈ సమావేశంలో బాలానగర్ డీసీపీ టి.శ్రీనివాస్రావు, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డితో పాటు ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నారు.