హైదరాబాద్ : బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంకు లాకర్ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని యూనియన్ బ్యాంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. 87 ఏండ్ల కృష్ణారెడ్డి నిన్న సాయంత్రం 4:20 గంటల సమయంలో బ్యాంక్కు వెళ్లారు. సిబ్బంది అనుమతితో లాకర్ గదిలోకి వెళ్లిన కృష్ణారెడ్డి తిరిగి వచ్చేసరికి బ్యాంక్కు తాళం వేశారు. చేసేదేమీ లేక కృష్ణా రెడ్డి లాకర్ గదిలోనే ఉండిపోయారు.
చీకటి పడినా కృష్ణారెడ్డి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా, కృష్ణారెడ్డి బ్యాంకులోనే ఉండిపోయినట్లు గుర్తించారు. 18 గంటల తర్వాత కృష్ణారెడ్డిని లాకర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంపై వృద్ధుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.