సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో కొత్తగా వెయ్యికిపైగా సిటీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎనిమిదేండ్లుగా జిల్లాల్లో తిరుగుతున్న 700 వరకు సూపర్ లగ్జరీలను నగరానికి తెచ్చి..వాటిని సిటీ బస్సులుగా మార్పులు చేయబోతున్నారు. సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య పెరుగుతున్నదని, దీంతో నగరానికి కొత్తగా బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
సిటీలో సరికొత్తగా 320 వరకు విద్యుత్ బస్సులను కూడా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ బస్సులన్నీ ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకుంటున్నామని, ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తికావచ్చినట్లు చెప్పారు. రెండు నెలల్లో నూతన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కొత్తగా 1016 బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీటిని ఆర్టీసీ సొంత డబ్బులతో కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే సిటీలో తిరుగుతున్న కాలం చెల్లిన 700 బస్సులను తుక్కు కింద మార్చబోతున్నట్లు చెప్పారు.