సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో ఆరోగ్యం, ఆహ్లాదం కోరుకునే నగరవాసుల కోసం హెచ్ఎండీఏ ఆక్సిజన్ (అర్బన్ ఫారెస్ట్) పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రేటర్ చుట్టూ గుర్తించిన అటవీ ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్లో మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉండేలా హెచ్ఎండీఏ పరిధిలో 21 చోట్ల భాగ్యనగర నందనవనం తరహాలో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను తీర్చిదిద్దింది.
గ్రేటర్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, యాదాద్రి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 5928.38 హెక్టార్లలో సుమారు రూ.96.64కోట్లతో 21 ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను గత 2 ఏండ్లలో అభివృద్ధి చేసింది. ఇప్పటికే మొదటిసారిగా గుర్తించిన అటవీ ప్రాంతం(రిజర్వ్ ఫారెస్ట్) చుట్టూ కిలోమీటర్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మాణం, కనువిందు చేసే ప్రవేశ ద్వారాలను నిర్మించారు. హెచ్ఎండీఏ అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయకముందు గుబురు పొదలతో, చెత్త చెదారంతో వృథాగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలన్నీ ప్రకృతి రమణీయ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. స్థానిక ప్రజల కోసం వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్లు, పిల్లల కోసం చిల్డ్రన్ కార్నర్లను నిర్మించడంతో కుటుంబ సమేతంగా పార్కుల్లో గడుపుతున్నారు.
పార్కుల ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం..
ప్రస్తుతం ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కులను మరోసారి ఆధునీకరించాలని నిర్ణయించారు. అందులో మొదటి విడతలో 14 అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ఆధునీకరణ పనులు చేపట్టాలని హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం సుమారు రూ.7.82 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ల్యాండ్ స్కేపింగ్తో పాటు కొత్తగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.