Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివార్లలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లోని భూములకు ఊహించని రీతిలో ధర పలికినట్లుగానే తాజాగా మోకిలలో కూడా కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. మోకిలలో చివరి రోజు మంచి డిమాండ్ నెలకొంది. రెండో దశలో 5వ రోజు విక్రయానికి ఉంచిన 60 ప్లాట్లను కొనుగోలుదారులు ఆన్లైన్లో పోటీపడి కొన్నారు. చదరపు గజానికి గరిష్ఠంగా రూ.64వేలు, కనిష్ఠంగా రూ.49వేలు పలికిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మొత్తం 18,700 చరదపు గజాల విస్తీర్ణంలోని 60 ప్లాట్లను రూ.46.75 కోట్లకు విక్రయానికి ఉంచగా అన్నీ అమ్ముడుపోయి..రూ.102.73 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
346 ప్లాట్లు.. రూ.716 కోట్ల ఆదాయం
మోకిల ప్లాట్లకు ఈనెల 7న మొదటి విడత వేలం పాటను ఆన్లైన్లో నిర్వహించారు. రెండు సెషన్లలో మొత్తం 48 ప్లాట్లను విక్రయించారు. చదరపు గజం అత్యధికంగా రూ.1,05,000 పలికింది. మొత్తం రూ.121.40 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో దశను ఈ నెల 23, 24, 25, 28, 29 తేదీల్లో నిర్వహించి 300 ప్లాట్లను విక్రయానికి ఉంచగా 298 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఐదు రోజుల పాటు జరిగిన వేలంలో మొత్తం రూ.595 కోట్లు వచ్చాయి. రెండు విడతల్లో రూ.716 కోట్లు ఆదాయం వచ్చింది. మోకిల లేఅవుట్లో ఒక్కో ప్లాటు కనీస ధరను రూ.25వేలుగా నిర్ణయిస్తే, అంతకు రెండు, మూడు రెట్లు అధికంగా వచ్చిందని తెలిపారు. మోకిల ప్రాంతం నియోపోలిస్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి వంటి ప్రాంతాలకు దగ్గరలో ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో విల్లా ప్రాజెక్టులు ఉండటంతో కొనుగోలుదారులు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల కొనుగోలు కోసం పోటీపడ్డారు.