హైదరాబాద్: నగర శివార్లలోని దూలపల్లిలో (Dulapally) ఓ కారు బీభత్సం సృష్టించింది. దూలపల్లి క్రాస్ రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూర్చుని ఉన్న వృద్ధురాలిపైకి దూసుకెళ్లింది. దీంతో విగ్రహం దిమ్మకు.. కారుకు మధ్య నలిగిపోయిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతురాలిని చిట్టెమ్మగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.