సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): భారతదేశంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా హృద్రోగాలతో ఆకస్మిక మరణాలు గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తున్నది. భారతదేశంలోనే హృద్రోగులు 60శాతం ఉంటుండగా.. ప్రపంచ సరాసరితో పోలిస్తే 10ఏళ్లు ముందుగానే 20శాతం మంది భారతీయుల మరణాలు నమోదవుతూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్), రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన సర్వేలో అనేక గగుర్పాటుగొలిపే విషయాలను వెల్లడించింది. హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న భారతీయ రోగులలో 50శాతం మంది మరణించినట్లు ఈ సర్వే తెలిపింది. వయసుతో సంబంధం లేకుండా యువతలోనూ గుండెపోటు బాధితులు పెరిగిపోతున్నట్లు సర్వేలో తేలింది.
హార్ట్ ఫెయిల్యూర్తో 8-12 మిలియన్ భారతీయులు
ప్రస్తుతం 8-12 మిలియన్ భారతీయులు హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడుతుండగా.. ప్రతి సంవత్సరం ఒక మిలియన్ చొప్పున బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. జీవనశైలిలో మార్పులు, అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి హృద్రోగ సమస్యలకు ప్రధాన కారణమవుతున్నాయి. అయితే మెజారిటీ గుండెపోటు మరణాలు అవగాహన లేమివల్లనే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికిత్సా విధానాలు మెరుగైనప్పటికీ హాట్ ఫెయిల్యూర్ వ్యాధి నిర్ధారణ సరిగా జరగక మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. గుండెపోటు బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే ముందే జాగ్రత్తపడడం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జీవనశైలి మార్పుతోనే..
హార్ట్ ఫెయిల్యూర్కు గల అతి ముఖ్యమైన కారణం అవగాహన లేకపోవడమే. హార్ట్ ఫెయిల్యూర్కు, హార్ట్ ఎటాక్ మధ్యగల తేడాపై కూడా ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. రోగులకు అవసరమైన నాణ్యమైన ఔషధాలు, వైద్య సౌకర్యాలను సైతం అందుబాటులో ఉంచడం అత్యంత కీలకం. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడంతోపాటు మధుమేహం, హైపర్ టెన్షన్, ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండడం వల్ల -హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా కలిగే మరణాలను తగ్గించవచ్చు.