సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) ;ఎన్నో కలలు..మరెన్నో ఆశయాలు.. అందరిదీ వ్యవసాయ కుటుంబమే.. పొట్టచేతబట్టుకొని ఉద్యోగాల కోసం నగరానికి వచ్చారు.. కాసేప్పట్లో విధులు ముగించుకొని.. ఇండ్లకు వెళ్దామనుకునేలోపే.. ఒక్కసారిగా ఉలిక్కిపాటు.. క్షణంలో చుట్టుముట్టిన అగ్నికీలలు.. ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేశాయి..పాతికేండ్లు నిండని ప్రాణాలు మృత్యుఒడికి చేరాయి.. సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటన ఆరు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. కొండంత అండగా ఉంటారనుకున్న వారంతా..విగతజీవులు కావడంతో బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి షార్ట్ సర్యూటే కారణమనినిర్ధారణకు వచ్చిన పోలీసులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేశారు. గొలుసు కట్టు విధానంలో చేసే వ్యాపారాలపై దేశంలో నిషేధం ఉన్నా.. క్యూనెట్ అనే సంస్థ విహాన్ డైరెక్ట్ సెలింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో భారీ ఎత్తున మల్టీ లెవల్ మార్కెటింగ్(ఎంఎల్ఎం) స్కీమ్లు నడిపిస్తున్నది. స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఈ సంస్థ కాల్సెంటర్ను నిర్వహిస్తున్నది.అగ్నిప్రమాదంలో చనిపోయిన వారంతా ఇందులో పనిచేస్తున్న వారే. మరోవైపు ఈ కంప్లెక్స్లో గతంలో తనిఖీ చేసిన అగ్ని మాపక, బల్దియా
అధికారులు.. అగ్ని ప్రమాద నివారణ లోపాలను గుర్తించి.. నోటీసులు జారీ చేశారు. అయినా యాజమాన్యం పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యం భారీ ప్రమాదానికి కారణమైంది. కాగా, స్వప్న లోక్ భవనం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ శుక్రవారం ప్రకటించింది.
‘వారంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు. పొట్టచేతపట్టుకొని ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చారు. మరి కాసేపట్లో డ్యూటీ ముగించుకొని ఇండ్లకు వెళ్తామనుకుంటున్న సమయంలోనే అగ్నికీలలు చుట్టుముట్టాయి. దట్టమైన పొగ పూర్తిగా కమ్ముకోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. కొండంత అండగా ఉంటారనుకున్న వారంతా.. అనంత లోకాలకు చేరడంతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. గురువారం రాత్రి సికింద్రాబాద్లోని స్వప్నలోక్లో జరిగిన అగ్ని ప్రమాదం.. ఆరు కుటుంబాల్లో చీకట్లను మిగిల్చింది.
గాంధీ దవాఖానలో పోస్టుమార్టం
స్వప్నలోక్ ఘటనలో మృతిచెందిన యువతీ యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో గాంధీ దవాఖానకు తీసుకువచ్చారు. ప్రమీల(22), వెన్నెల(20), త్రివేణి(22), శివ(22), శ్రావణి(22), ప్రశాంత్(22) మృతదేహాలు ఆసుపత్రికి చేరుకోగానే.. బాధిత కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. శుక్రవారం గాంధీ ఫోరెన్సిక్ విభాగం హెచ్వోడీ కృపాల్ సింగ్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను ఆయా కుటుంబాలకు అప్పగించారు. ప్రభుత్వ అంబులెన్స్లలోనే మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు.
మిన్నంటిన రోదనలు
గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ‘మేం ఏం పాపం చేశాం దేవుడా..! మాకు ఇంత బాధను మిగిల్చావు’ అంటూ మృతదేహాలపై పడి బాధిత కుటుంబీకులు రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
కేసు నమోదు
స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం ఘటనపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం వహించిన స్వప్నలోక్ సూర్య కిరణ్ ఎస్టాబ్లిష్మెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్, వికాస్ పేపర్ ప్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్తో పాటు క్యూనెట్ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్పై కేసులు నమోదు చేశారు. వీరిపై 304 పార్ట్ 2, 342, 420 ఐపీసీ, సెక్షన్ 9 (బి), పేలుడు పదార్థాల చట్టం 1984 కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ తెలిపారు. కాంప్లెక్స్లోని ఐదవ అంతస్థు బి బ్లాక్లో ఉన్న కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్, వికాస్ పేపర్ ఫ్టెక్సో ప్యాకింగ్ లిమిటెడ్ నుంచి మంటలు వ్యాపించినట్లు గుర్తించామన్నారు.
మంత్రుల పరామర్శ
మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి శుక్రవారం గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచిన మృతదేహాల వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు భరోసా ఇచ్చారు.
తాత్కాలికంగా స్వప్నలోక్ కాంప్లెక్స్ మూసివేత
స్వప్నలోక్ భవనం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ శుక్రవారం ప్రకటించింది. గురువారం జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం క్లూస్టీమ్, జీహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ అధికారులు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలతో పాటు భవనం పటిష్టతపై అంచనాకు వచ్చారు. ముఖ్యంగా అగ్ని ప్రమాదం దాటికి ఐదవ అంతస్తులో స్లాబులు, పిల్లర్లు, బలహీనపడటంతో భవనం కూలే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జేఎన్టీయూ బృందం పర్యవేక్షించి నివేదిక వచ్చే వరకు స్వప్నలోక్ భవనాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
1985నాటి భవనం
సికింద్రాబాద్ పరిధిలోని స్వప్నలోక్ భవనాన్ని నగరానికి చెందిన మహవీర్ అగర్వాల్ 1985లో సెల్లార్తో పాటు ఆరు అంతస్థులకు అనుమతులు తీసుకొని నిర్మించారు. దీన్ని ఏ, బీ బ్లాక్లుగా నిర్మాణం (నిర్మాణ అనుమతి నం. 6/టీపీ 5/83, నం.92/9) చేపట్టారు. ఈ భవనాన్ని పదేళ్ల కిందట ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మరో రెండు అంతస్థులు నిర్మించారు. అయితే 2019లో పై అంతస్థు పెచ్చులూడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ సమయంలోనే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు అందజేశారు. దీంతో పాటు ఫైర్ సేఫ్టీ పెట్టుకోవడంతో పాటు మెయింటనెన్స్ సరిగా చూసుకోవాలని అధికారులు సూచించారు. కానీ భవనాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడంతో ఐదేళ్ల కిందట బ్లాక్లలో వాణిజ్య సముదాయాలు నిర్వహిస్తున్న పలువురు ఎన్నికలు నిర్వహించుకొని భవనం మెయింటనెన్స్ను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సెక్యూరిటీ, హౌస్ కీపింగ్లను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. కానీ అనుకోకుండా ఐదవ అంతస్థులో గురువారం రాత్రి 7గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి 6,7 అంతస్థులకు వ్యాపించాయి.
కల్లలైన ‘వెన్నెల’ సివిల్స్ కల
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మర్పల్లి గ్రామానికి చెందిన వెన్నెల(20) డిగ్రీ పూర్తిచేసింది. సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్కు వచ్చింది. వెన్నెల తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పార్ట్టైంగా స్వప్నలోక్ కాంప్లెక్స్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఉద్యోగం కోసం రూ.1.40లక్షలు కావాలని చెబితే తల్లిదండ్రులు అప్పుచేసి కట్టారు. కూలీ పనులు చేస్తూనే రూ.40వేలు పెట్టి ల్యాప్టాప్ ఇప్పించారు. వారం రోజుల్లో తన క్లాస్మేట్ పెళ్లి ఉన్నది.. ఊరికి వస్తున్నట్లు గురువారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఇంతలోనే కూతురు మృత్యువాత పడిందని ఆమె తల్లిదండ్రులు గుండెలు బాధుకుంటూ బోరున విలపించారు. గ్రూప్స్ రాసి ఉద్యోగం తెచ్చుకున్నాక ఇన్నాళ్లు పడ్డ కష్టాలన్నింటినీ దూరం చేస్తానని వెన్నెల చెబుతుండేదని కన్నీటిపర్యాంతమయ్యారు.
రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తానని..
ఉన్నత ఆశయంతో నగరానికి వచ్చిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన ప్రశాంత్(24) జీవితం అర్థాంతరంగా ముగిసింది. ప్రశాంత్ తల్లిదండ్రులు జనార్దన్, ఉపేంద్రమ్మలది వ్యవసాయ కుటుంబం. ప్రశాంత్ డిగ్రీ వరకు చదివాడు. నాలుగు రోజుల కిందటే స్వగ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యాడు. అందరితో కలుపుగోలుగా మెలిగాడు. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తల్లి ఉపేంద్రమ్మకు ఫోన్ చేశాడు. డ్యూటీ ముగించుకొని హాస్టల్కు వెళ్లాక రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ఛాప్ కాగా.. స్నేహితులు ప్రమాదం గురించి చెప్పారని ప్రశాంత్ తల్లిదండ్రులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు అర్థాంతరంగా తనువు చాలించాడని కన్నీరుమున్నీరయ్యారు.
‘మీటింగ్లో ఉన్నా..మళ్లీ ఫోన్ చేస్తా’ ఇవే చివరి మాటలు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన రామారావు, వల్లమ్మలకు ఇద్దరు కూతుర్లు. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి ఇద్దరు కూతుళ్లను డిగ్రీ వరకు చదివించారు. త్రివేణి(22) ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చి స్వప్నలోక్ కాంప్లెక్స్లోని ఓ కంపెనీలో ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నది. గురువారం తల్లి వల్లమ్మతో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా ‘మీటింగ్లో ఉన్నా..మళ్లీ ఫోన్ చేస్తా’ అని చెప్పిందని, అవే త్రివేణి చివరి మాటలంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని త్రివేణి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అప్పుచేసి పట్నం పంపిస్తే..
నర్సంపేట్ మండలం ఖానాపురం గ్రామానికి చెందిన పద్మ, నర్సింహ హోటల్లో లేబర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ముగ్గురు సంతానంలో శ్రావణి(22) పెద్ద కూతురు. ఇంటర్ చదివిన శ్రావణి యేడాది కిందట హైదరాబాద్కు వచ్చింది. హాస్టల్లో ఉంటూ స్వప్నలోక్లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. తమలాగా తన కూతురు జీవితం ఉండకూడదని, అప్పుచేసి మరీ కూతుర్ని పట్నం పంపిస్తే.. ఇలా అవడంతో తట్టులేకపోతున్నామని పద్మ, నర్సింహ ఏడుస్తూ చెప్పారు.
ఉగాది పండుగకు వస్తున్నానని
వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలం చంద్రయ్యపల్లికి చెందిన శివ(22) బీటెక్ చదివాడు. ఏడాదిన్నర కిందట ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటికి ఫోన్చేసి కుటుంబ సభ్యులతో శివ మాట్లాడాడు. ఉగాది పండుగకు వస్తున్నానని చెప్పాడని, పండుగకు రాకుండానే కానరానిలోకాలకు వెళ్లాడంటూ శివ తల్లిదండ్రులు రాజు, రజిత గుండెలు బాధుకున్నారు.
అండగా ఉంటుందనుకున్నాం
మహబూబాబాద్ జిల్లా సురేశ్నగర్లో నివాసముంటున్న బద్రు, బుజ్జీల కూమార్తె ప్రమీల(22). సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. ఆమె తల్లిదండ్రులు కూడా వ్యవసాయ కూలీలే. కూతురు ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న నేపథ్యంలో మృత్యువాత పడటంతో ఈ కుటుంబం ఛిద్రమైంది. ఇలా అవుతుందని అనుకోలేదని ప్రమీల తల్లిదండ్రులు విలపించారు.
పరామర్శించిన డిప్యూటీ మేయర్
బాధిత కుటుంబసభ్యులను నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి పరామర్శించారు. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్ను బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు.