సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఇన్ఫ్లో ఆధారంగా అప్రమత్తమైన జలమండలి అధికారులు శనివారం హిమాయత్సాగర్ నుంచి ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువన మూసీలోకి 4120 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శుక్రవారం రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 700 క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు..ఎగువ నుంచి 3500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో నీటి విడుదలను పెంచుతూ వస్తున్నారు. అయితే గండిపేట (ఉస్మాన్సాగర్)లోకి నామమాత్రంగా 300 క్యూసెక్కుల మేర మాత్రమే వరద నీరు వచ్చి చేరుతున్నది. రిజర్వాయర్ గరిష్ఠ మట్టానికి మరో ఐదు అడుగుల మేర ఉండడంతో గేట్లను ఎత్తి వేసే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే నిండుకుండలా మారిన జంట జలాశయాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
మూసీలో పెరిగిన వరద ఉధృతి
మలక్పేట, జూలై 22: హిమాయత్సాగర్ గేట్లను ఎత్తి వరద నీటిని వదలడంతో మూసీలో ప్రవాహం పెరిగింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద అడుగు లోతులో నీరు ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులు మూసారాంబాగ్ బ్రిడ్జిని సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ డీసీపీ అశోక్కుమార్, సౌత్ ఈస్ట్ ఏసీపీ సత్యనారాయణ, మలక్పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, అంబర్పేట ఇన్స్పెక్టర్ కిషన్, జీహెచ్ఎంసీ సౌత్జోన్ సర్కిల్-6 ఈఈ పీర్సింగ్, ఏఈ రవికాంత్లతో కలిసి వంతెనను సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. బ్రిడ్జిపైకి వరద వస్తే వాహనాలను మహారాజ హోటల్ నుంచి గోల్నాక న్యూ బ్రిడ్జి వైపు దారి మళ్లించాలని అధికారులను ఆదేశించారు.