బంజారాహిల్స్, ఏప్రిల్ 27: జూబ్లీహిల్స్లో నివాసముంటున్న వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రోడ్ నెం.2లోని జూబ్లీ బాల్పార్క్ అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న వ్యాపారి మహ్మద్ తమీమ్ ఇంట్లో పనిచేసేందుకు పనిమనిషి కావాలంటూ గత ఏడాది అక్టోబర్లో ఉర్దూ దినపత్రికలో ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన చూసిన ఫహ్మీదా బేగం (55) అనే మహిళ రెండుసార్లు వాట్సప్ ద్వారా కాల్ చేసి ఆసక్తి కనబర్చింది. తనకు కొన్ని పనులున్నాయని, వాటిని పూర్తి చేసుకున్న తర్వాత పనిలో చేరుతానంటూ చెప్పింది. ఈ మేరకు ఈనెల 7న ఫహ్మీదాబేగం పనిలో చేరి అక్కడే నివాసముంటోంది. రెండ్రోజుల తర్వాత యజమాని తమీమ్తోపాటు అతడి భార్య అరీజ్ మిర్జాతో కలిసి డిన్నర్ కోసం బయటకు వెళ్లారు.
ఈనెల 11న తనకు ఊర్లో అర్జెంట్ పని ఉందంటూ ఫహ్మీదా బేగం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దాంతో మరో పనిమనిషిని ఉద్యోగంలో పెట్టుకున్నారు. కాగా ఈనెల 24న ఫంక్షన్కు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న క్రమంలో బెడ్రూమ్లోని కప్బోర్డును తెరిచి చూడగా అక్కడ ఉండాల్సిన వజ్రాభరణాలు, 40తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. రెండు డైమండ్ నెక్లెస్లు, బంగారం నెక్లెస్లు, గాజులు, బ్రాస్లెట్, ఉంగరాలు మాయమయ్యాయని బాధితుడు మహ్మద్ తమీమ్ సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో రెండ్రోజుల పాటు పనిచేసిన ఫహ్మీదా బేగం చోరీకి పాల్పడి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు.