బంజారాహిల్స్, డిసెంబర్ 14: హుక్కా సెంటర్పై జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం. 14లో నివాసముంటున్న జీషాన్ అహ్మద్ అలియాస్ జీషాన్(38) గతంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో హుక్కా సెంటర్లు నిర్వహించాడు. నగరంలో హుక్కా సెంటర్ల నిర్వహణపై నిషేధం ఉంది. దీంతో నిందితుడు రహస్యంగా తెలిసిన వారికి హుక్కా సరఫరా చేస్తున్నాడు. ఇందుకు జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లోని అస్మా ఎస్టేట్స్ భవనంలోని ఆరో అంతస్తుతో పాటు టెర్రస్ను అద్దెకు తీసుకున్నాడు. పోలీసులు ఎన్నికలు బందోబస్తు హడావిడిలో ఉండడాన్ని అదునుగా తీసుకున్న నిందితుడు పదిరోజుల కిందట హైదరాబాద్ టైమ్స్ కేఫ్ పేరుతో హుక్కా పార్లర్ను ఏర్పాటు చేశాడు.
నగరంలోని యువతీ యువకులకు ఫోన్లు చేస్తూ తమకు హైకోర్టు నుంచి అనుమతి వచ్చిందని, హుక్కా సెంటర్ నడిపిస్తున్నామని చెబుతూ.. హుక్కా సరఫరా చేస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్, ఎస్ఐ రాకేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం రాత్రి హైదరాబాద్ టైమ్స్ కేఫ్ హుక్కా సెంటర్పై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో సుమారు 60 మంది యువతీ యువకులు హుక్కా సేవిస్తూ పట్టుబడ్డారు. ఆర్గనైజింగ్ మేనేజర్ రియాజ్ పోలీసుల రాకను పసిగట్టి పారిపోయాడు. హుక్కా సెంటర్లో పనిచేస్తున్న మేనేజర్ పురాణం సాయికృష్ణ చైతన్య, రౌత్ సాయి భరత్, జనార్దన్, షాబుద్దీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి 28 హుక్కా పాట్స్, 30 హుక్కా పైపులు, 150 హుక్కా ఫిల్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు జీషాన్ అహ్మద్, మేనేజర్ రియాజ్తో సహా నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు వచ్చి తనిఖీలు నిర్వహించేందుకు వీలులేకుండా నిందితుడు అస్మా ఎస్టేట్స్ భవనంలోని లిఫ్ట్ను యాప్ ద్వారా బ్లాక్ చేయడంతో పాటు కేవలం తెలిసిన వారు మాత్రమే లోనికి వచ్చేలా యాక్సెస్ కార్డును గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే సిబ్బంది వద్ద ఉంచాడు. యాక్సెస్ కార్డుతో లిఫ్ట్ ఆరో అంతస్తుకు వెళ్లేలా ఏర్పాటు చేశాడు. లిఫ్ట్ తప్ప ఇతర మార్గాలన్నీ మూసేయించారు. బుధవారం రాత్రి పోలీసులు హుక్కాసెంటర్పై దాడి చేసేందుకు కస్టమర్ల అవతారంలో లోనికి ప్రవేశించాల్సి వచ్చింది. గతంలో ఈ హుక్కా సెంటర్లో హుక్కా సేవించిన యువకుడితో కలిసి ఇద్దరు పోలీసులు లోనికి ప్రవేశించారు. అక్కడున్న యువతీ యువకులు అవాక్కయ్యారు. చాకచక్యంగా హుక్కా సెంటర్లోకి ప్రవేశించి దాడులు నిర్వహించిన జూబ్లీహిల్స్ ఎస్ఐ రాకేశ్తో పాటు ఇతర అధికారులను వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ అభినందించారు.