Book Fair | సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 : ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. ఆదివారం కావడంతో పుస్తకప్రియులు భారీగా తరలివచ్చారు. స్టాల్స్ కలియతిరుగుతూ తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. విభిన్న రకాల పుస్తకాలు అందుబాటులో ఉండటంతో పుస్తక ప్రేమికులతో స్టాల్స్ అన్నీ సందడిగా మారాయి. మరోవైపు రవ్వా శ్రీహరి వేదికపై పలు పుస్తకావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.
ఎన్టీఆర్ స్టేడియంలోని గద్దర్ ప్రాంగణంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్, వీక్షణం వేణుగోపాల్, ఆచార్య ఎన్.గోపి, సాహితీవేత్త పసునూరి రవీందర్ పుస్తక సమీక్షలో మాట్లాడుతూ… ఈ పుస్తకం తెలంగాణ సాహిత్య చరిత్రకు పెద్దబాలశిక్ష లాంటిదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపయోగపడే దినుసులాంటిదని చమత్కరించారు. డాక్టర్ సింగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుడిపాటి, కాసుల ప్రతాప్రెడ్డి, డాక్టర్ ఎస్.రఘు, ఉప్పాల శ్రీరామ్ తదితరులు పుస్తకంపై ఉపన్యసించారు.