సిటీబ్యూరో, మే 26, (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ‘చెత్త’శుద్ధి కరువైంది. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యం నీరుగారుతోంది. రహదారులను చెత్తాచెదారం ముంచెత్తుతోంది. ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతుండటంతో కాలనీలు కంపుకొడుతున్నాయి. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రేటర్లో చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా దాదాపు మూడున్నరేండ్ల కిందట డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో చెత్త కుండీలను జీహెచ్ఎంసీ ఎత్తేసింది. మెరుగైన పారిశుధ్య నిర్వహణను పకడ్బందీ చేస్తూ వందకు వంద శాతం ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోల సంఖ్యను పెంచారు. సుమారు 5250 స్వచ్ఛ ఆటోల ద్వారా నగరంలో 4886 కాలనీల్లో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సేకరణ జరగాలి. ఒకొక ఆటోకు కాలనీ వారీగా చూస్తే.. ఒకటి లేదా రెండు కాలనీలు గృహాల ప్రకారంగా గమనిస్తే.. ఒకొక అటోకు సుమారు 500 నుంచి 600 ఇండ్లను కేటాయించి, చెత్త సేకరణ జరపాలి. కానీ గడిచిన కొన్ని రోజులుగా స్వచ్ఛ ఆటోల పనితీరు సరిగా ఉండటం లేదు. చాలా కాలనీలకు రోజూ స్వచ్ఛ ఆటోలు రావడం లేదు. వందకు వంద శాతం స్వచ్ఛ ఆటోల అటెండెన్స్ ఉండటం లేదు. రోజూ వందలాది స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని స్వయంగా కమిషనర్ రొనాల్డ్ రాస్ ఇటీవల గుర్తించారు. స్వచ్ఛ ఆటోల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయినా స్వచ్ఛ ఆటోల తీరు మారడం లేదు.
చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భేజి వనరేబుల్ పాయింట్లు/జీవీపీ)పై యాక్షన్ ప్లాన్ అటకెక్కింది. గ్రేటర్లో డస్ట్ బిన్లు ఎత్తివేసి..స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ ప్రక్రియ జరుపుతుండగా..అక్కడక్కడ కొందరు బహిరంగంగానే చెత్త వేస్తూ వస్తున్నారు. ఇలా గ్రేటర్ వ్యాప్తంగా 2640 చోట్ల చెత్త కుప్పలున్నట్లు గుర్తించారు. కానీ జీవీపీ పాయింట్ల ఎత్తివేతలోనే అధికారుల అలసత్వం ప్రదర్శిస్తుండటం, జోనల్ కమిషనర్లు సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
స్వచ్ఛ ఆటోల పనితీరులో ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం వెరసి.. ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతున్నది. సమయ పాలన పట్టించుకోకపోవడం, చెత్త సేకరణలో అధిక వసూళ్లకు తెరలేపడం, సిటీలో ఉండాల్సిన స్వచ్ఛ ఆటోలు గ్రేటర్ సరిహద్దులు దాటడం వంటి ఘటనలపై ఇప్పటికే ఫిర్యాదులు కొకొల్లలుగా వచ్చాయి. స్వచ్ఛ ఆటోలను దారిలోకి తీసుకురావడం, ఉదయం ఆటో బయలు దేరే సమయం..వ్యర్థాల సేకరణ పూర్తయ్యాక ట్రాన్స్ఫర్ స్టేషన్ల వరకు వెళ్లే వరకు ‘క్యూ ఆర్’ స్కాన్ విధానాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. శానిటేషన్కు సంబంధించిన విభాగంలో ఏఎంహెచ్ఓలు, ఇంజినీరింగ్, ఎంటమాలజీ సిబ్బంది, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్లు ఉన్నా.. సమన్వయ లోపంతో పారిశుధ్యం అటకెక్కుతున్నదని, పర్యవేక్షణలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా వంద రోజుల కార్యాచరణకు అధికారుల కోసం ‘ మై జీహెచ్ఎంసీ ’యాప్ను అందుబాటులోకి తీసుకురాగా, పూర్తి స్థాయి వినియోగంలో ఉన్నతాధికారులు చేతులెత్తేయడంతో నగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. తద్వారా నగర వీధులు ముక్కుపుటాలదిరే దుర్వాసనతో పాటు దోమల స్వైర విహారం ఎక్కువగా ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.