సిటీబ్యూరో, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25వ తేదీన ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ 20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు 2500 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు దాదాపు 40 వేల మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించి, బందోబస్తు, పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె మూర్తి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్తో కలిసి మీడియాకు వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాలతో పాటు అక్టోపస్, మౌంటెడ్ హార్స్, స్పెషల్ పోలీసు బృందాలు, షీ టీమ్స్తో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే సిబ్బంది కూడా బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్(టీఐసీసీసీ)కు ఈ సీసీ కెమెరాలను అనుసంధానం చేశామన్నారు. క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఏమి చేస్తున్నాడనే విషయం తెలిసిపోతుందన్నారు.
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 25న జరుగనున్న క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకుల కోసం ప్రత్యేక సిటీ బస్సులు ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ మేనేజర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. సికింద్రాబాద్, జేబీఎస్, మేడ్చల్, హకీంపేట్, జోడిమెట్ల, ఘట్కేసర్, కోఠి, మోహిదీపట్నం, పటాన్చెరు వంటి వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.