బడంగ్పేట, డిసెంబర్ 17: ‘బడంగ్పేట మేయర్ పదవికి ఎసరు’ అన్న కథనం ‘నమస్తే’లో ఆదివారం ప్రచురితం కావడం చర్చనీయాంశంగా మారింది. ఎలాగైనా మేయర్పై అవిశ్వాసం పెట్టాలని మెజార్టీ సభ్యులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మేయర్ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందని కార్పొరేటర్లు సమాలోచనలు చేస్తున్నారు. తప్పనిసరిగా మార్పు జరగాల్సిందేనని మెజార్టీ కార్పొరేటర్లు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఏ పార్టీకి ఎంత మంది మద్దతు ఉందని లెక్కలు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 14 మంది కార్పొరేటర్లు ఉండగా, బీజేపీకి 10 మంది, కాంగ్రెస్కు ఏడుగురు, స్వాతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారని లెక్కలు వేసుకున్నారు.
మేయర్ పదవి వస్తుందంటే కొందరు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అవిశ్వాసం పెట్టడం వల్ల కార్పొరేటర్లకు బంఫర్ ఆపర్ ప్రకటిస్తున్నారు. పది లక్షల నుంచి 15 లక్షలకు వరకు కార్పొరేటర్లకు ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి మద్దతు ప్రకటిస్తామని, కొందరు కార్పొరేటర్లు బహిరంగంగానే చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతర్గతంగా మేయర్ పీటం దక్కించుకోవాలని ప్రణాళికలు రచించుకుంటున్నారు.
మేయర్ పదవికి సహకరిస్తే.. రెండు కోట్లు..
23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లగూడెం సంతోషీ శ్రీనివాస్రెడ్డి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి.. తనకు మేయర్ పదవికి సహకరిస్తే రెండు కోట్లు ఇస్తానంటూ బంఫర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. లేదంటే ప్రతి కార్పొరేటర్కు 10 నుంచి 15 లక్షల చొప్పున ఇస్తానని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. దీంతో బడంగ్పేట మేయర్ అవిశ్వాసం హాట్ టాఫిక్గా మారింది. రెండు మూడు రోజుల్లో కొందరు కార్పొరేటర్లు సమావేశం కానున్నట్లు తెలిసింది. ఎలాగైనా ఒక్కసారి మేయర్ పీటం దక్కించుకోవాలన్న ఆలోచనలో రాళ్లగూడెం సంతోషీ శ్రీనివాస్రెడ్డి ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. కార్పొరేటర్లు ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు తెలిసింది. కార్పొరేటర్లు అందరూ అవిశ్వాసం పెట్టాలన్న అంశానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జనవరిలో మార్పు తప్పదని చర్చించుకుంటున్నారు.