మద్నూర్, మార్చి 25 :పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాన్ని మండలంలోని చిన్నశక్కర్గ గ్రామం అందిపుచ్చుకొని ముందుకుసాగుతున్నది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని అభివృద్ధిబాటలో పయనిస్తున్నది. మండలంలోని చిన్నశక్కర్గ గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. పార్కులో రకరకాల మొక్కలతో పాటు గ్రామస్తులు సేద తీరడానికి బెంచీలను ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. వాకింగ్ కోసం ట్రాక్ను ఏర్పాటు చేయడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కులో సందడి నెలకొంటున్నది. మొక్కలకు నిత్యం నీళ్లు పడుతున్నారు. ఉపాధిహామీ, పంచాయతీ నిధులతో పార్కును ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో ఆహ్లాదకరంగా మారింది. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం పనులు పూర్తయ్యాయి. విశాలమైన స్థలంలో వైకుంఠధామాన్ని నిర్మించారు.
గ్రామానికి కొత్తకళ..
పల్లె ప్రకృతి వనంతో గ్రామం కొత్తశోభను సంతరించుకున్నది. గ్రామస్తులందరం సమష్టి కృషితో అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రకృతి వనాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. -గఫార్, సర్పంచ్, చిన్నశక్కర్గ