ఈరోడ్: తమిళనాడులో పొయ్యిల కట్టెల కోసమని సమీప అడవిలోకి వెళ్లిన మహిళ ఏనుగు బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఈరోడ్ జిల్లా కదంబూర్ అటవీ ప్రాంతంలోని నగరత్తినం పట్టణ సమీపంలోగల కుండ్రీ గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం కట్టెల కోసమని వెళ్లిన మహిళ సాయంత్రానికి కూడా ఇంటికి చేరుకోకపోవడంతో.. ఆమె భర్త మరికొందరు గ్రామస్తులతో కలిసి అడవిలో వెతికేందుకు వెళ్లారు.
అక్కడ సదరు మహిళ విగతజీవిగా కనిపించింది. ఆమె ఒంటిపై తీవ్రగాయాలు, చుట్టూ ఏనుగు పాదాల గుర్తులు ఉండటంతో ఆమెను ఏనుగు తొక్కి చంపిందని నిర్ధారణకు వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.