ముంబై: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలో కొత్త కేసులు భారీగా నమోదవుతుండటంతో అక్కడి అధికారులు లాక్డౌన్ విధించారు. సోమవారం నుంచి వారం రోజులపాటు సిటీ అంతటా పూర్తిస్థాయి లాక్డౌన్ అమలవుతుందని ప్రకటించారు. ఆ మేరకు ఇవాళ తెల్లవారుజము నుంచే నాగ్పూర్లో కంప్లీట్ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది.
ఈ లాక్డౌన్ అమలు కోసం అధికారులు నాగ్పూర్ వీధుల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. రోడ్లపై పోలీస్ పహారాతోపాటు, వారంపాటు నగరమంతటా నిరంతర గస్తీ కొనసాగుతుందని నాగ్పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. ఈ వారం రోజుల్లో అనవసరంగా వీధుల్లోకి వచ్చే వారిపైన, ఇతర కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.