వనస్థలిపురం, మే 5 : వనస్థలిపురం పరిధిలోని సాగర్ కాంప్లెక్స్ వద్ద ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. సాగర్ హైవే పక్కన ఉన్న పండ్ల దుకాణం నిర్వాహకులపై ఒకేసారి 20 మంది దాడి చేశారు. దీంతో దుకాణాదారులు తిరగబడ్డారు. షాపులో ఉన్న కత్తులతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు దాడి చేసిన వ్యక్తులు పరారయ్యారు. కాగా, పండ్ల దుకాణాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించగా పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన వనస్థలిపురం ప్రాంతంలో సంచలనం సృష్టించింది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన షఫీ అహ్మద్ఖాన్, సాధిక్ అలీ, మహబూబ్ పాషా, బాబా మహ్మద్ ఒకే కుటుంబసభ్యులు. సాగర్ కాంప్లెక్స్ ఎదురుగా.. సాగర్ రహదారి పక్కన పండ్ల దుకాణం నిర్వహిస్తున్నారు. గత నెల 18న గుర్తు తెలియని వ్యక్తులు వీరి షాపు వద్దకు వచ్చి బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు.
డబ్బులు ఇవ్వకపోవడంతో షఫీపై దాడిచేసి రూ. 10వేలు లాక్కొని వెళ్లిపోయారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో 20 మంది ఒకేసారి వచ్చి వీరి షాపుపై దాడి చేశారు. షాపులో ఉన్న కత్తులను తీసుకొని దాడికి పాల్పడ్డారు. అనంతరం పండ్ల షాపు, కొబ్బరి బోండం షాపులను తగులబెట్టి పారిపోయారు. మంటలు భారీగా రావడంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాగా, వచ్చిన వ్యక్తుల్లో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వచ్చింది ఎవరు.. దాడి చేసింది ఎవరు.. గాయాలయ్యింది ఎవరికీ.. అనే విషయం తెలియడం లేదు. పోలీసులు కూడా ఈ విషయమై ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. ఘటనా స్థలంలో సాధిక్ అలీ, షఫీ, మహబూబ్ పాషాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స కోసం వారిని దవాఖానకు తరలించారు. కాగా, షీఫీ, సాధిక్ శరీరంపై కత్తిగాట్లు, రక్తపు గాయాలు కనిపించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.