కేపీహెచ్బీ కాలనీ, జనవరి 25 : ప్రీ లాంచింగ్ పేరుతో తక్కువ ధరకే ఇండ్ల స్థలాలు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు అంటూ ప్రజల వద్ద డబ్బులు వసూళ్లు చేసి పరారైన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. బుధవారం కేపీహెచ్బీ కాలనీ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ ఎ.చంద్రశేఖర్, కేపీహెచ్బీ కాలనీ ఇన్స్పెక్టర్ కిషన్కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ర్టానికి చెందిన కాకర్ల శ్రీనివాస్ (44) నిజాంపేటలోని పీఎన్ఆర్ హైట్స్లో నివాసముంటున్నాడు. రెండేండ్ల కిందట కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లో జయంత్రి రిహాబిలిటేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేసి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ను నియమించుకొని వ్యాపారం ప్రారంభించాడు.
నగర శివారు ప్రాంతాల్లోని ప్రగతినగర్, అమీన్పూర్, చందానగర్, నిజాంపేట, టోల్కట్టా, సదాశివ్పేట, షాద్నగర్, రాయదుర్గం, లింగంపల్లి, సర్దార్పటేల్నగర్ ప్రాంతాల్లో వెంచర్ల పేరిట ఆసక్తిగల వినియోగదారుల నుంచి ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో బుకింగ్లు చేపట్టి డబ్బులు వసూలు చేశాడు. ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాకపోడంతో అనుమానం వచ్చిన వినియోగదారులు ఆఫీస్కు వెళ్లి చూడగా.. బోర్డును తిప్పేసిన కాకర్ల శ్రీనివాస్ పరారయ్యాడు. దీంతో జీడిమెట్లకు చెందిన రవిశ్రీకాంత్తో పాటు మరో ఎనిమిది మంది కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం కాకర్ల శ్రీనివాస్ను అరెస్టుచేసి, రిమాండ్కు తరలించారు. ఎనిమిది మంది బాధితుల నుంచి సుమారు రూ.20 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని, బాధితులు పెరిగే అవకాశం ఉన్నదని పోలీసులు భావిస్తున్నారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేశారు. ఈ సంఘటనలో కంపెనీ డైరెక్టర్ బోల్ల శ్రీనివాస్రావు, మునీశ్వర్, శ్రీనివాస్ పరారీలో పోలీసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అడ్మిన్ ఎస్సై రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.