సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో ఏదైన ప్రభుత్వ కార్యక్రమం జరిగితే ఏదో తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపేసుకునేవాళ్లు. గోరంత జేసి కొండంత చెప్పుకునేవాళ్లు. ఫొటోలకు, వీడియోలకు పోజులిచ్చి నాయకులు అక్కడి నుంచి పలాయనం చెందేవారు. ఇక తన్నుకు చావడం ప్రజలవంతయ్యేది. నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చే ఏ పథకమైనా ఉచితంగా ఇవ్వాలంటే వారికి చేతులు రాకపోయేది. ఇచ్చుడే ఎక్కువ..మీకు ఇంక గౌరవమా అన్నట్టు ఛీత్కారాలు.. ఇలా ఏండ్ల కొద్దీ ఉమ్మడి పాలకుల పాలన కమీషన్ల కక్కుర్తిలో కరిగిపోయింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అటువంటి ఉమ్మడి రాక్షస సంస్కృతికి చరమగీతం పాడింది. ప్రజల కోసం నిర్వహించే కార్యక్రమం ఓ మహోత్తరమైన రోజుగా భావించింది. అదొక పండుగగా సాగాలని నిర్ణయించింది. గూడు లేని నిరుపేదల ఎన్నో ఏండ్ల తండ్లాటకు కొండంత అండగా సీఎం కేసీఆర్ నిలబడి వారి కోసం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టే పెద్దన్నయ్యాడు. శనివారం నగరంలో జరిగిన ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఆడబిడ్డలను ఎంతో ఘనంగా ఆహ్వానించి వారి రాకపోకలకు బస్సులు ఏర్పాటు చేశారు. నోరూరించే వంటకాలతో కడుపు నిండా భోజనం పెట్టి ఆడబిడ్డలకు ఆశీస్సులు అందించింది తెలంగాణ సర్కార్. ఇంత గొప్పగా వారిని గౌరవించుకుని వారి చేతుల్లో లక్షల రూపాయల విలువ జేసే ఇంటికి సంబంధించిన పట్టాను పెట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిని ఆత్మీయంగా పలకరించి తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న అభిమానాన్ని చాటారు.
తలరాత మార్చిన సీఎం కేసీఆర్
ఉమ్మడి పాలనలో మహిళలు తమ తలరాత ఇంతేనని గూడుకేడ్చారు. బిడ్డల పెండ్లి జెయ్యలేక అప్పుల కోసం అష్టకష్టాలు పడ్డారు. డెలివరీ కోసం ఇంటికొచ్చిన బిడ్డకు ఆరోగ్య సపర్యలకు బాధపడ్డారు. పుట్టిన బిడ్డకు పోషకాహారం అందించలేక ఆకలి కేకలు విన్నారు. భర్త చనిపోతే బతుకు భారమై కుటుంబం రోడ్డున పడే దుస్థితికి బలయ్యారు. ఇక తెలంగాణలో బతకడమంటే కష్టాలతో నడవడమే అనేంత కుంగిపోయారు. ఆ ఆడబిడ్డల తలరాతను చదివిన కేసీఆర్ వారి మోముపై ఒక తేజస్సును సంతరించుకునేలా బృహత్తర కార్యక్రమాలను సఫలం చేసి చూపించారు. పెండ్లి నుంచి పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ల వరకు.. పింఛన్ల నుంచి కుటుంబ పెద్ద చనిపోతే రైతుబీమా వరకు.. దళిత, బీసీ బంధు నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు ప్రతీ దాంట్లో ఆడబిడ్డల క్షేమాన్ని కాంక్షించిన తెలంగాణ ప్రభుత్వం మన కండ్ల ముందు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. నిరుపేదలకు నగరంలో ప్రైమ్ లొకేషన్లలో ఆత్మగౌరవ సౌధాలు నిర్మించి అందించి నూతన చరిత్రను లిఖించింది.
గుండెల్లో సంతోషం
నా భర్త ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. ఎవరైనా పనుంది అని పిలిస్తేనే ఆ రోజు చేతిలో పైసల్ ఉండేవి. నెలకు రూ.2500 కిరాయి. చిన్న ఇరుకు గదుల్లో 20 ఏండ్లకు పైగా ఉంటున్నం. ఇల్లు గడవడమే కష్టమవుతున్న ఈ దినాల్లో సొంతిల్లు, జాగ అనే ఆలోచనే చేయలే. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినంక గరీబోళ్లకు ఇండ్లిస్తమని ఎన్నికలప్పుడు తెలిసింది. మీ సేవలో దరఖాస్తు చేసినం. అందరి పేర్లను లాటరీ వేస్తమని అధికారులు చెప్పిండ్రు. అందులో వచ్చిన వారికి ఇండ్లిస్తమన్నరు. ఇప్పుడు ఇచ్చిండ్రు. ప్రభుత్వం అందిస్తున్న ఇళ్లు బాగున్నాయి. కిరాయికి కట్టే పైసల్ ఇప్పుడు చిట్టిలకు..మరేదైనా వాటికి వాడుకుంటా.
– వట్టేపల్లి శ్రీలత
సీఎం కేసీఆర్ సారు సల్లగుండాలి
పనులుంటేనే చేతికి డబ్బులు. లేదంటే.. ఆ రోజు ఇళ్లు గడవడమే ఒకింత కష్టం. నెలవారి కిరాయి రూ.6500 చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ గత 25 ఏళ్లుగా బతుకీడుస్తున్నం. అలా బతుకుతున్న మాకు సొంతిళ్లు అంటే ఓ కలగానే మిగిలి ఉండేది. ప్రభుత్వం అందించే ఇంటిని పొందాలని ప్రయత్నాలు చేశాం. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో దరఖాస్తులు చేశాం. కాలం గడిపిండ్రు గాని ఇంటి జాడ కానరాలే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి.. చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నరు. నిరుపేదలకు అండగా నిలుస్తున్న కేసీఆర్ సారు సల్లంగ ఉండాలే. మాకిప్పుడు మస్తుగా సంతోషం అయితున్నది.
– శ్యామల, కామాటిపుర
సొంతింటి కల నెరవేరింది
సొంతింటి కల నెరవేరింది. ఎన్నో సంవత్సరాలుగా సొంతింటి కోసం ఎదురు చూశాం. మా ఆయన మల్లేశ్ క్యాబ్ డ్రైవర్. మాకు ఇద్దరు పిల్లలు. చేసిన కష్టం అద్దెకు, పిల్లల చదువులకు ఖర్చు అవుతుంది. ఎక్కడైనా జాగా కొందామంటే కొనలేని పరిస్థితి. ఈ రోజు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూంకు సంబంధించిన పట్టా చేతికి అందింది. చాలా సంతోషంగా ఉంది.
– అశ్విని, ఎన్టీఆర్ నగర్
సీఎం సారు ఇల్లు ఇచ్చి ఆదుకున్నడు..
కర్ణాటక నుంచి గత 24 ఏండ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి ఎన్టీఆర్నగర్లో నివాసముంటున్నా. నా భర్త 5 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అనేక కష్టాలు పడ్డాం. కూతురిని, కొడుకుని ప్రయోజకులను చేయాలని వారిని చదివించాలని నిశ్చయించుకొని కుట్టుమిషన్ మార్గాన్ని ఎన్నుకున్నా. వచ్చిన ఆదాయంతో అద్దె కిరాయి కడుతూ పిల్లలను చదివించుకుంటున్నా. నేను ఒక్కదాన్నే సంపాదించే ఆదాయంతో ఇళ్లు గడవడం కష్టంగా ఉంది. ఈ సమయంలో సీఎం కేసీఆర్ రూపంలో బంగారు భవిష్యత్ అవకాశం లభించింది. సొంత ఇల్లు రావడంతో కుటుంబమంతా సంతోషపడుతున్నాం. సీఎం బాగుండాలి.
– కళావతి, ఎన్టీఆర్నగర్
పైసా ఖర్చు లేకుండా…
అమ్మ గౌస్ ఉన్నీసా బేగం పేరు మీద ఇల్లు వచ్చింది. ఇంట్లో అమ్మ, తమ్ముడితో కలిసి జీవనం సాగిస్తున్నాం. అమ్మకు ఆనారోగ్యం కారణంగా మంచానికి పరిమితమైంది. నేను వచ్చి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్ చేతుల మీదుగా పట్టా అందుకున్నా. నేను ఇండ్లలో పని చేస్తూ వచ్చిన ఆదాయంతో కిరాయి కడుతూ ఇంటిని నడుపుతున్నా. పైసా ఖర్చు లేకుండా సొంతింటిని సీఎం కేసీఆర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్కు మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది.
– పర్వీన్ బేగం, సరూర్నగర్
మా కుటుంబం సంతోషానికి అవధుల్లేవు
సరూర్నగర్లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాం. తల్లి, భార్య, ఇద్దరు పాపలతో కలిసి గత 30 ఏళ్లుగా జీవిస్తున్నాం. రూ.30 నుంచి మొదలై..నేడు రూ.4వేల వరకు ఇంటి కిరాయి చెల్లిస్తున్నా. ఎన్ని ప్రాంతాలు మారినా జీవితంలో ఎదుగు బొదుగు లేకపోగా..నెలనెలా కిరాయి కట్టడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో నా భార్య కవిత పేరు మీద మంకాల్లో ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరైంది. దీంతో మా కుటుంబం సంతోషానికి అవధుల్లేవు. చాలా సంతోషంగా ఉంది.
– లబ్ధిదారులు భర్త సురేందర్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు…
సొంతూరు చందంపేట మండలం పెద్దమునిగల్. పొట్టకూటి కోసం హైదరాబాద్కు పిల్లాపాపలతో వచ్చి చంపాపేట్లో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాం. భర్త మంగ్త అడ్డా కూలీ. నేను కూలీ పనులు చేస్తున్నా. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మాది. నెలకు రూ.2,500 అద్దె కట్టడం కష్టమవుతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్కు దరఖాస్తు చేసుకున్నాం. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఇంటి మంజూరు పత్రాన్ని అందుకున్నాం. సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు. ఇల్లు రావడంతో సంతోషంగా ఉంది.
-ముఢావత్ సురి, లబ్ధిదారురాలు
చాలా సంతోషంగా ఉంది
నా వివాహం అయినప్పటి నుంచి అద్దెకు రేకుల ఇంట్లో ఉంటున్నాం. మా ఆయన ఆటో డ్రైవర్. చాలీ చాలనీ జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇరుకు ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కేసీఆర్ పుణ్యమా అని సొంత ఇల్లు వచ్చింది.
-అస్మాబేగం, తలాబ్కట్ట
సీఎం కేసీఆర్ను ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటా..
పదకొండు ఏండ్లు అద్దె ఇంట్లోనే జీవితం గడిపా. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది. నా సంతోషానికి అవధులు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లంగా ఉండాలి. డబుల్ ఇండ్లను నిజంగా పేదలకే పంచారు. నా కుటుంబానికి నీడనిచ్చిన సీఎం కేసీఆర్ను ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటా..
-సోనిబాయి,పూరానాపూల్
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం
పేదల కలలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. కొన్నేండ్లుగా ఇండ్లు లేక ఇబ్బందుల ఎదుర్కొంటున్న మాకు డబుల్ బెడ్ రూం పథకంలో భాగంగా ఇండ్లు మంజూరు చేయడం మరిచిపోలేని విషయం. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పేదల అవసరాలను తీరుస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– శ్రీలత, మల్లాపూర్