సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ) : హరితహారంతో నగరం పచ్చగా కళకళలాడుతున్నది. హరితవనంగా మారుతున్నది. యజ్ఞంలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. తొమ్మిదో విడత హరితహారంలో భాగంగా ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించగా, బల్దియా అర్బన్ బయో డైవర్సిటీ విభాగం గ్రీన్ యాక్షన్ ప్లాన్ పేరుతో రంగంలోకి దిగింది. ఒక్కో కాలనీని యూనిట్గా తీసుకొని.. ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేలా పూలు, పండ్ల మొక్కలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నది. అక్కడి పార్కులను సైతం ఆహ్లాదకరంగా మార్చుతున్నది. ఇటీవల వర్షాలతో హరిత ప్రక్రియ కాస్త ఆలస్యమైనా.. వానలు తగ్గుముఖం పట్టడంతో మొక్కలు నాటే పనులను వేగవంతం చేశారు అధికారులు. శుక్రవారం వరకు 18.10 లక్షల మొక్కలను నాటారు. డిసెంబర్ నాటికి లక్ష్యం పూర్తి చేయనున్నారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో విడత పనులను జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్సిటీ విభాగం మరింత ముమ్మరం చేసింది. ఈ ఏడాది కోటి మొక్కల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఎల్బీనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్లో ఒక్కో జోన్కు 20 లక్షలు, చార్మినార్, సికింద్రాబాద్లో ఒక్కో జోన్కు 14 లక్షలు, ఖైరతాబాద్ జోన్లో 12 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే గ్రీన్ యాక్షన్ ప్లాన్ పేరుతో ఒక్కో కాలనీని యూనిట్గా తీసుకుని కాలనీలో ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేలా పూలు, పండ్ల మొక్కలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా కాలనీ పార్కులను పచ్చదనంతో ఆహ్లాదకరంగా మార్చుతున్నారు. ఇటీవల వర్షాలతో హరితహారం కాస్త జాప్యం జరిగినా.. వానలు తగ్గుముఖం పట్టడంతో పనుల్లో వేగం పెంచారు. ఇందులో భాగంగానే శుక్రవారం నాటి వరకు 18.10 లక్షల మొక్కలు నాటినట్లు వచ్చే డిసెంబర్ నాటికల్లా లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.