తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
రవీంద్రభారతిలో పారిస్ ప్రొఫెసర్ డానియల్ నేజెర్స్తో భేటీ
రవీంద్రభారతి, జనవరి13 : ఫ్రెంచి -తెలుగు మహా నిఘంటువు ప్రచురణకు తెలంగాణ సాహిత్య అకాడమీ సిద్ధంగా ఉందని చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. సుమారు 1500 పేజీలతో వెలువడనున్న ఈ గ్రంథానికి తెలంగాణ సాహిత్య అకాడమీ సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. తెలుగు భాష, సాహిత్యంపై 35 ఏండ్లుగా పరిశోధనలు చేస్తున్న పారిస్ ప్రొఫెసర్ డానియల్ నేజర్స్తో గురువారం గౌరీశంకర్ భేటీ అయ్యారు. వందల ఏండ్లుగా తెలుగు భాష, సంస్కృతులతో అనుబంధం కలిగిన పారిస్లో తెలుగు సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, తెలంగాణ ప్రభుత్వ సహాయ, సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నానని డానియల్ వివరించారు. పారిస్లో తెలుగు భాష, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సీఎం కేసీఆర్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టికి తీసుకెళ్లి, నిర్ణయిస్తామని జూలూరు గౌరీశంకర్ చెప్పారు. తెలుగు నుంచి ఫ్రెంచిలోకి అనువధించిన పుస్తకాలను సైతం తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురిస్తున్నదని తెలిపారు. ఫ్రెంచి-తెలుగు మహానిఘంటువు కోసం డానియల్ చేస్తున్న కృషిని అభినందించారు.