హయత్నగర్, డిసెంబర్ 11: కక్షిదారులు న్యాయ స్థానాల్లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకున్నట్లయితే ఇరువురూ విజయం సాధించినట్లేనని హయత్నగర్ 24వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పి.చందన అన్నారు. శనివారం హయత్నగర్ కోర్టులో జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ చందన మాట్లాడుతూ.. కేసుల సత్వర పరిష్కారానికి లోక్అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఇరువర్గాలకు రాజీ మార్గం కుదిర్చి కేసులను పరిష్కరించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. లోక్అదాలత్కు కక్షిదారుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. సివిల్, క్రిమినల్, యాక్సిడెంట్లు, చెక్ బౌన్స్, భూవివాదాలు వంటి కేసులను పరిష్కరించుకోవడానికి లోక్అదాలత్ సులువైన మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణోదయకుమార్, న్యాయవాదులు ఎన్.సత్యనారాయణ, రామ్మోహన్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐలు సురేందర్గౌడ్, సత్యనారాయణ, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది రాంచందర్, శాంభవి పాల్గొన్నారు.