పారదర్శకంగా నాలాల అభివృద్ధి
15 ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం
నాణ్యత పరిశీలన యూనివర్సిటీలకు అప్పగింత
ఆరు రకాలైన పద్ధతులపై పరీక్షలు
సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ): వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. గతేడాది అనుభవాలు పునరావృతం కాకుండా వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించి నాలాల అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు ప్రతి మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పనుల్లో వేగిరం పెంచుతున్నారు. 15 ప్యాకేజీల్లో 52 పనుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 33 , శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చేపడుతున్న 19 పనులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ సమయంలోనే అత్యంత పారదర్శకంగా పనులు జరిగేలా నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నారు. ఈ మేరకు యూనివర్సిటీల ద్వారా క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేయనున్నారు. ఎస్ఎన్డీపీ పనులకు సైతం క్వాలిటీ కంట్రోల్ పరీక్షలకు టెండర్లు పిలిచి ఇటీవల 15 ప్యాకేజీ పనుల నాణ్యతను పరిశీలించేందుకు వివిధ యూనివర్సిటీలకు బాధ్యతలు అప్పగించారు. ఆరు రకాలైన పద్ధతుల ద్వారా నాణ్యతను నిర్ధారించడంతో పాటు పనులు జరుగుతున్నప్పుడు లోపాలు గుర్తించి తగిన సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది.