గొంతు, మెడపై విచక్షణారహితంగా దాడి
చికిత్స పొందుతున్న బాధితురాలు.. పరిస్థితి విషమం
పోలీసుల అదుపులో నిందితుడు
ఎర్రగడ్డలో నడిరోడ్డుపై దారుణం
భయంతో భీతిల్లిన స్థానికులు
వెంగళరావునగర్, జనవరి 11 ;ఎర్రగడ్డలో పట్టపగలు.. నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఆ మహిళపట్ల ప్రియుడే.. కాల యముడయ్యాడు. తనను కాదని మరో పెండ్లి చేసుకున్న దని పగ పట్టాడు. ఎలాగైనా మట్టుపెట్టాలని పథకం పన్నాడు. రోడ్డుపై మాటువేసి.. కత్తులతో దాడికి దిగాడు. గొంతు, మెడపై కత్తితో పొడిచాడు. అడ్డుకోవాల్సిన స్థానికులు ఇండ్లలోకి పరుగులు పెట్టారు. నడిరోడ్డుపై రక్తపు మడుగులో పడివున్న ప్రియురాలు చనిపోయిందని భావించి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఏపీ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సూర్యనారాయణ, డి.శ్యామల(35)కు 2007లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఉపాధి కోసం ఈ దంపతులు నగరా నికి వచ్చి ఎర్రగడ్డలో ఉన్నారు. పెండ్లి అయిన ఏడాదికి మొదటి సంతానం కుమారుడు, రెండవ సంతానం ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో 2009లో భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఇండ్లలో పాచిపనులు చేసుకుని తన ఇద్దరు పిల్లలను శ్యామల పోషించుకునేది.
ప్రియుడికి తెలియకుండా మరో వివాహం
2016లో ఎర్రగడ్డ సుల్తాన్నగర్కు చెందిన సైకిల్ మెకానిక్ షాపు నిర్వాహకుడు సయ్యద్ ఖలీల్(34)తో పరిచయం ఏర్పడింది. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదిలాఉండగా 2017లో ఓ హోటల్లో వంటమనిషిగా పనిచేసే శ్రీశైల్ కోట్ను రెండో వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు పుట్టాడు. అయినప్పటికీ ప్రియుడిని రహస్యంగా కలుసుకునేది. కానీ మరో పెండ్లి చేసుకున్న విషయం చెప్పలేదు. అయితే గత ఆరు నెలలుగా ప్రియుడిని దూరం పెట్టసాగింది. మరో వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న ప్రియుడు ఆమెపై పగబట్టాడు.
కాలనీ నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే..
ఎర్రగడ్డ గౌతంపురి కాలనీలో ఇండ్లలో పనులు చేసేందుకు వెళ్తున్న సమయంలో శ్యామలను హతమార్చాలని ఖలీల్ పథకం పన్నాడు. ఆదివారం ఎర్రగడ్డ సండే మార్కెట్లో మూడు కత్తులను కొనుగోలు చేశాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. మంగళవారం ఉదయం 7గంటల ప్రాంతంలో శ్యామల గౌతంపురి కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా చెట్టుచాటున నక్కి కాపుకాశాడు. ఆమె సమీపంలోకి రాగానే కత్తితో దాడికి దిగాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే గొంతు, మెడపై దాడిచేశాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు శ్యామల పరుగులు తీసినప్పటికీ తీవ్ర రక్తస్రావం కావడంతో కొద్ది దూరంలోనే కుప్పకూలిపోయింది. ఖలీల్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. పుటేజీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తలుపులు, కిటికీలు మూసుకున్న జనం
కాలనీ నడిరోడ్డుపై ఓ వివాహితపై దాడి జరుగుతుంటే ఏ ఒక్కరూ అడ్డుకోలేదు. పిల్లలను ఇంట్లోకి లాక్కెళ్లి కిటికీలు, తలుపులు మూసేసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాక.. ఇండ్లలోనుంచి బయటకు వచ్చి 108కు, పోలీసులకు సమాచారమిచ్చారు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న శ్యామలను గాంధీ దవాఖానలో చేర్పించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. నిందితుడు ఖలీల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను దూరం పెట్టడమే కాకుండా.. తనకు చెప్పకుండా మరో పెండ్లి చేసుకోవడంతోనే దాడికి పాల్పడినట్లు నిందితుడు ఖలీల్ పోలీసులకు తెలిపాడు.