సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్వర్క్ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ) ఛేదించి ఏడుగురిని అరెస్ట్ చేసింది. వారి వద్దనుంచి 204 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు ఘటనల్లో నలుగురు అరెస్టయ్యారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కొండాపూర్లో నివాసముండే సానాఖాన్, హైదరాబాద్లోని ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి. ఆమెకు ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకోవడం అలవాటుంది. ఆమె బస్లో ముంబైకి వెళ్లి అక్కడ డ్రగ్స్ కొనుగోలుచేసి హైదరాబాద్కు వస్తుంది. కొన్నాళ్లకు తానే డ్రగ్స్ విక్రయించడం మొదలు పెట్టింది. ఇందుకు ప్రత్యేకంగా తన స్నేహితులతో కలిసి నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. ముంబైలో ఒకగ్రామ్ డ్రగ్ రూ.2 వేల నుంచి రూ.3 వేలకు కొనుగోలుచేసి, హైదరాబాద్కు వచ్చి ఒక్కో గ్రామ్ డ్రగ్ రూ.7 వేలకు విక్రయించింది. ఈ విషయంపై హెచ్న్యూకు సమాచారం అందడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో పుణేలో షెఫ్ అంబారసర్య పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్న కొండాపూర్కు చెందిన హర్ష మహాజన్ అలియాస్ రాజ్వీర్ పట్టుబడ్డాడు. వీరిద్దరు ఇచ్చిన సమాచారంతో ముంబైలో కీలక డ్రగ్ విక్రేతలు, నైజీరియన్ డ్రగ్స్ పెడ్లర్స్ విషయం వెలుగులోకి వచ్చింది.
చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి భలేరావు విక్రయాలు సాగిస్తుండగా.. అందులో మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. అతడి ద్వారా తీసుకెళ్లిన డ్రగ్స్ను ముంబైలో యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నది. మత్తుకు బానిసైన యువత.. యువతులకు కూడా మత్తు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. అతడి నెట్వర్క్లో ప్రాథమికంగా 81 మంది వినియోగదారులు ఉన్నట్లు హెచ్న్యూ గుర్తించింది. వీరిలో హైదరాబాద్కు చెందిన సానాఖాన్ నెట్వర్క్ కూడా ఉంది. ఆమె ద్వారా మరో 40 మంది వరకు వినియోగదారులు ఉన్నారని హెచ్న్యూ గుర్తించింది. 30 మంది జావేద్ శంషీర్ అలీ సిద్దిఖీ వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడయ్యింది. డ్రగ్స్ తయారు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి మినహా.. మిగతా ఈ నెట్వర్క్లోని నిందితులను హెచ్న్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్ నేతృత్వంలోని బృందం అరెస్ట్ చేసింది. వీరి నుంచి 204 గ్రాముల ఎండీఎంఏ, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
ముంబై, అంధేరికి చెందిన మెహరాజ్ ఖాజీ అదే ప్రాంతంలో ఉండే సూరజ్ గోస్వామి (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు) వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ను కొనుగోలుచేసి హైదరాబాద్తో పాటు ముంబైలోని పలు ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నాడు. ఒక్కో గ్రాము రూ.10 వేల చొప్పున విక్రయిస్తున్నాడు. నిందితుడిని హెచ్న్యూ ఇన్స్పెక్టర్ రమేశ్రెడ్డి బృందం అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 40 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్టణం అరకు ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, ముంబైకి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు సభ్యులున్న ముఠాను ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అఫ్జల్గంజ్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన బిల్కిస్ మహ్మద్ సులేమాన్, అలీసాగర్ సైఫుద్దీన్ రాంపుర్వాలా గత కొన్నేండ్లుగా ముంబైలో గంజాయి విక్రయిస్తుండటంతో పలు కేసులు నమోదయ్యాయి. అరక్లో గంజాయి పండించే శ్రీనివాస్ నుంచి రకీబ్ అనే వ్యక్తి ఎక్కువ స్థాయిలో గంజాయి కొనుగోలుచేసి ముంబైలో విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో సులేమాన్, సైఫుద్దీన్, జహీరాబాద్కు చెందిన ముర్తూజా షేక్తో కలిసి రకీబ్ ద్వారా శ్రీనివాస్ను సంప్రదించారు. ఇందులో భాగంగా శ్రీనివాస్ గంజాయి విక్రయించేందుకు ఒప్పుకున్నాడు. రూ.20 వేలకు అబ్దుల్ అనే వ్యక్తి ఇన్నోవా కారును అద్దెకు తీసుకొని.. తన భార్యతో కలిసి అరుకు వెళ్లాడు. శ్రీనివాస్ వద్ద 110 కిలలో గంజాయి కొనుగోలు చేశారు. గంజాయి ప్యాకెట్లను ఇన్నోవా కారు సీటు కింద పెట్టి హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్లోని ఇమ్లీబన్ ప్రాంతంలో కారు ఆపి, 20 కిలోల గంజాయి జహీరాబాద్కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్కుమార్ బృందం నిందితులను పట్టుకుంది. ఈ ఘటనలో సులేమాన్, సైఫుద్దీన్, ముర్తూజా షేక్ను అరెస్ట్ చేయగా.. మిగతా వారు పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా హెచ్న్యూ , టాస్క్ఫోర్స్ సిబ్బందిని సీపీ సీవీ ఆనంద్ అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు.