సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ) : ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసమే బాల రక్షక్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్పల్లిలో కలెక్టర్ శర్మన్తో కలిసి తలసాని, బోయిన్పల్లిలో మల్లారెడ్డి బాల రక్షక్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం 1098 హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసి, జిల్లాకు ఒకటి చొప్పున సీఎస్ఆర్ నిధులతో బాల రక్షక్ వాహనాలను కేటాయించిందన్నారు. అనాథ బాలలు, 18 ఏండ్ల లోపు పిల్లలు భిక్షాటన చేసినా, బాల్య వివాహం జరుగుతున్నా హెల్ప్లైన్కు కాల్ చేయాలని కోరారు. హెల్ప్ లైన్కు కాల్ వచ్చిన వెంటనే ప్రొటెక్షన్ ఆఫీసర్, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ అధికారులు కలిసి బాల రక్షక్ వాహనంతో సంఘటనా స్థలానికి చేరుకొని వారిని రక్షిస్తారన్నారు. బాల సదనంకు చేర్చి వారికి వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారని మంత్రులు వివరించారు. పరిస్థితులను బట్టి పోలీసు, రెవెన్యూ తదితర సంబంధిత శాఖల అధికారుల సహకారం కూడా తీసుకుంటారని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల రక్షక్ వాహనాలు నిర్వహించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సుమలత, సికింద్రాబాద్ సీపీడీవో సునంద, ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయభాసర్ పాల్గొన్నారు.