CJI Chandrachud | న్యూఢిల్లీ, మార్చి 20: వన్ ర్యాంక్- వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపులపై కేంద్రం అభిప్రాయాలను అటార్నీ జనరల్ సీల్డ్ కవర్లో సమర్పించటంపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంప్రదాయానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘మేం ఎలాంటి సీల్డ్ కవర్లు, రహస్య పత్రాలు తీసుకోం. వ్యక్తిగతం నేను అలాంటి వాటికి వ్యతిరేకిని. కోర్టుల్లో పారదర్శకత ఉండాలి. ఈ కేసులో రహస్యం ఏముంటుంది? మేమిచ్చిన ఆదేశాలను అమలు చేయాలి అంతే కదా! ఈ సీల్డ్ కవర్ సంప్రదాయానికి స్వస్తి పలుకుదామనుకుంటున్నా. ఈ పద్ధతిని సుప్రీం కోర్టు అనుసరిస్తే హైకోర్టులు కూడా అనుసరిస్తాయి’ అని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అంటే.. ఎవరి జీవితాలకైనా ప్రమాదం జరుగుతుంది అనుకుంటేనే ఈ పద్ధతిని అనుసరించాలని తేల్చి చెప్పారు.
బకాయిల చెల్లింపులపై కేంద్రానికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. తాము ఇచ్చిన తీర్పునకు కేంద్రం లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఓఆర్ఓపీ బకాయిలను నాలుగు విడతల్లో చెల్లిస్తామంటూ కేంద్ర రక్షణ శాఖ గత జనవరి 20న ఇచ్చిన ఉత్తర్వులపైనా మండిపడింది. ఈ ఉత్తర్వులను ఉన్నఫలంగా వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇండియన్ ఎక్స్సర్వీస్మెన్ మూవ్మెంట్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ‘ఓఆర్ఓపీ పథకానికి సంబంధించి కోర్టు తీర్పునకు లోబడి కేంద్ర ప్రభుత్వం పనిచేయాల్సిందే. ముందు నోటిఫికేషన్ను ఉపసంహరించుకోండి. తర్వాత మీరు కోరిన గడువును పరిశీలిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం.. ‘ఈ ఏడాది ఏప్రిల్ 30 లోగా అమర జవాను కుటుంబాలకు, అవార్డులు గెలుచుకున్నవారికి ఒకే విడతలో బకాయి చెల్లించాలి. జూన్ 30 నాటికి 70 ఏండ్లకు పైబడిన పెన్షనర్లకు చెల్లించాలి. మిగతా అర్హులకు మూడు వాయిదాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోగా మొత్తం చెల్లించాల్సిందే’ అని కోర్టు తీర్పు వెలువరించింది.