ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 10: దేశంలోని ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అందించడమే రాజ్యాంగ లక్ష్యమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. ప్రతి మనిషి జీవించే హక్కులో భాగంగా మానవ హక్కులు ఏర్పడ్డాయని, జీవించడమంటే గౌరవంగా జీవించడం అని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ప్రతి వ్యక్తికి అందించాలని రాజ్యాంగం బోధిస్తున్నదని వివరించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం సదస్సును నిర్వహించారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లా విభాగం డీన్, ప్రైవేట్ లా కళాశాలల సహకారంతో పీజీఆర్ఆర్సీడీఈ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కులు అందరికీ సమానమేనని అన్నారు. మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
హక్కుల పట్ల ప్రజలకు అవగాహన లేకపోతే హక్కుల ఉల్లంఘన జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఓయూ లా విభాగం డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ప్రజల వద్దకు న్యాయం, ప్రజలందరికీ న్యాయం అనే నినాదంతో ‘జస్టిస్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రజలకు రాజ్యాంగం, హక్కుల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
రాజ్యాంగ దినోత్సవమైన గతనెల 26వ తేదీ నుంచి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నాన్ జ్యుడీషియల్ సభ్యుడు మహమ్మద్ ఇర్ఫాన్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, లా విభాగం హెడ్ డాక్టర్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి మురళీమోహన్ పాల్గొన్నారు.