సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి : మహిళలు, డ్రగ్స్ను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరగాడిని ఎట్టకేలకు యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్టీయూ), మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్రలోని పుణె ప్రాంతానికి చెందిన సోఫిన్ అబ్బాస్ పాటిల్(38) మహిళలతో పాటు డ్రగ్స్ను దేశంలోని వివిధ నగరాల్లోని వ్యభిచార నిర్వాహకులకు సరఫరా చేస్తాడు.
ఈ క్రమంలో నిందితుడు సైబరాబాద్ పరిధిలోని అధీమ్ అలియాస్ అర్నవ్ అనే వ్యభిచార నిర్వాహకుడికి సరఫరా చేస్తున్నాడు. దీంతో అధీమ్ నగరంలో పెద్ద ఎత్తున హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు గత సంవత్సరం డిసెంబర్లో అధీమ్ అడ్డాపై దాడులు జరిపి మహిళల రవాణాకు పాల్పడుతున్న 60మంది నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు. ఈ కేసులో అధీమ్ను అరెస్టు చేయగా ప్రధాన నిందితుడైన సోఫిన్ అబ్బాస్ పాటిల్ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. అతడి కోసం వేట ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు ఈనెల 26న గచ్చిబౌలిలో డ్రగ్స్, మహిళల రవాణాకు పాల్పడుతున్న ఘరానా నేరగాడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 8గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.