సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రజా చైతన్యాన్ని తీసుకురావడంలో మీడియా పదునైన ఆయుధంగా పని చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రభుత్వ సిటీ కళాశాల జర్నలిజం విద్యార్థులు తమ పాఠ్య ప్రణాళికలో భాగంగా మీడియా అకాడమీలో నిర్వహించిన ‘చైర్మన్తో ముఖాముఖీ’ నిర్వహించారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ మీడియాలో పారదర్శకత, ప్రామాణికత పెరగాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మీడియాలో అనేక అవాంఛనీయ ధోరణలు ప్రబలుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడూ సరిచేసుకుంటూ బాధ్యతయుతమైన పాత్రను నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సంచలన విషయాలకు, సినిమా, క్రీడాకారుల వ్యక్తిగత విషయాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, ఇలాంటి విషయాలకే టీఆర్పీ రేటింగ్ ఉంటుందని, ప్రేక్షకులు కూడా ఆ అంశాలపైనే కుతూహలం చూపుతున్నారని అన్నారు.
ఇది సముచితం కాదని, ప్రతికా యాజమాన్యం విధానం ఏమైనప్పటికీ సంపాదకుడికి ఉండే స్వేచ్ఛను వారు కోల్పోకూడదని ఆయన విశ్లేషించారు. ఈ సందర్భంగా సిటీ కళాశాల తెలుగు విభాగం, మీడియా విభాగంతో కలిసి ‘సృజనాత్మక రచన’ సర్టిఫికెట్ కోర్సును నిర్వహించాలని ప్రతిపాదించగా, అల్లం నారాయణ ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సహా ఆచార్యులు డాక్టర్ కె. నీరజ, డాక్టర్ కోయి కోటేశ్వర రావు, జర్నలిజం విద్యార్థులు హరిత, నందిని, ఆకాష్, శిరీష, నితిన్, అక్షిత పాల్గొన్నారు.