నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో
అభివృద్ధి చేసుకుందాం..
వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి
దమ్మాయిగూడలో సీవరేజీ పైప్లైన్ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన
మేడ్చల్ కలెక్టరేట్, పిబ్రవరి 24: ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 13, 14, 15 వార్డుల్లో రూ.7.10కోట్లతో చేపట్టిన సీవరేజీ పైప్లైన్ పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు ముంపు సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిధులను కేటాయించిందని అన్నారు.
ఈ పైప్లైన్ పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని, 8, 9వ వార్డు ల్లో పైప్లైన్ పనులకు నిధులు కేటాయిస్తామని అన్నారు. నాసిన్ చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. దమ్మాయిగూడతో పాటు వివిధ ప్రాంతాలకు నెల రోజుల్లో ఇంటింటికీ తాగునీరు అందస్తామన్నారు. హెచ్ఆర్డీసీఎల్ సహకారంలో మున్సిపాలిటీలో మూడు రోడ్లను అభివృద్ధి చేస్తామని, మున్సిపాలిటీకి రూ.1.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్గా ఉందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి, స్థానిక కౌన్సిలర్లు రమేశ్గౌడ్, నర్సింహారెడ్డి, స్వప్న హరిగౌడ్, శ్రీహరి గౌడ్, అనురాధ, పావని, వెంకటరమణ, నానూనాయక్, సురేఖ, సుజాత, వెంకటేశ్, కీసర గుట్ట ఆలయ ట్రస్ట్ బోర్టు సభ్యులు సాయినాథ్గౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.