అబిడ్స్, జనవరి 6: కురుమల కుల దైవమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానానికి చైర్మన్గా కురుమలను నియమించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. అదే విధంగా షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్తో పాటు ఇతర చైర్మన్ స్థానాలలో కురుమలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రికి మరోసారి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.
ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కురుమ కులానికి చెందిన బీర్ల ఐలయ్యకు ముస్లిం జంగ్ వంతెన వద్ద గల కురుమ సంఘం భవనంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజలకు ఏ విధమైన సమస్యలున్నా తన దృష్టికి తీసుకు వస్తే వారికి అండగా నిలబడ్తానని హామీనిచ్చారు.
కురుమల అభ్యున్నతికి పాటు పడ్తానని, ఎవరికి ఇబ్బందులున్నా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. ఎమ్మెల్సీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం మాట్లాడుతూ జిల్లాల వారిగా కురుమల సమస్యల పరిష్కారానికి పాటు పడ్డామని, కురుమ సంఘం రాష్ట్ర భవనం మన్సూరాబాద్లో నిర్మించేందుకు పాటు పడినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్, తుల ఉమ, జవహర్నగర్ కార్పొరేషన్ మేయర్ కావ్య, కురుమ సంఘం రాష్ట్ర, నగర నాయకులు బండారు నారాయణ, తూముకుంట అరుణ్ కుమార్, కొలుపుల నరసింహ, కట్ట మల్లేశం, జీఎస్ శివకుమార్, బాలయ్య కురుమ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.