అది దేశ స్వాతంత్య్రానికి పూర్వమే ప్రారంభమైన పాఠశాల. తొలుత ఉర్దూ మీడియం మాత్రమే ఉన్న ఆ పాఠశాల కాలక్రమేణా తెలుగు మీడియం పాఠశాలగా మారింది. కాలంతో పాటు మారుతూ, తనను తాను ఆధునీకరించుకుంటూ ఇంగ్లిష్ మీడియాన్ని కూడా ప్రారంభించుకున్నది. తమ పిల్లలూ ఇంగ్లిష్ మీడియం చదువాలనుకున్న తల్లిదండ్రులకు అది ఓ వరంలా మారింది. చుట్టుపక్కల ఉన్న ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తూ తన మార్కు చాటుకున్నది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియం పాఠశాలగా మారబోతున్నది. ఆరోతరగతి తెలుగుమీడియంలో జీరో అడ్మిషన్స్ ఉండి ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో కళకళలాడుతున్న ఆ పాఠశాల గురించి తెలుసుకోవాలంటే లాలాపేట వెళ్లాల్సిందే.
లాలాపేట్ ప్రభుత్వ పాఠశాల దాదాపు 80 సంవత్సరాల నుంచి 1.8 ఎకరాల స్థలంలో కొనసాగుతున్నది. నిజాం నవాబుల కాలంలో ఇక్కడ ఉర్దూ మీడియం మాత్రమే ఉండేది. క్రమంగా తెలుగు మీడియానికి మార్చుతూ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. 2006 సంవత్సరంలో ఇంగ్లిష్ మీడియం బోధనను అందుబాటులోకి తీసుకువచ్చారు.
అనంతరం ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనా పద్ధతులు, మెళకువలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా ఇంగ్లిష్ మీడియానికి మారిన లాలాపేట్ పాఠశాలలో దాదాపు 350పైగా విద్యార్థులు నమోదయ్యారు. వీరిలో 280 వరకు ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ఉండగా, 70 మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం 6వ తరగతి తెలుగు మీడియంలో ఒక్క విద్యార్థి కూడా ప్రవేశం పొందలేదని, జీరో అడ్మిషన్లు నమోదైనట్లు హెడ్మాస్టర్ ప్రతాప్రెడ్డి ధ్రువీకరించారు. విద్యార్థులందరూ ఇంగ్లిష్ మీడియంలోనే ప్రవేశాలు పొందుతున్నారు. ప్రాథమిక పాఠశాలలో అన్ని తరగతులు, సెక్షన్లు కలిపి దాదాపు 250 మంది విద్యార్థులు ఉన్నారు.
పదో తరగతిలో 84 శాతం ఉత్తీర్ణత..
లాలాపేట్ స్కూల్లో పదో తరగతిలో దాదాపు 50మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో ప్రతి ఏటా 84 శాతం వరకు ఫలితాలు నమోదవుతున్నాయి. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న విద్యార్థులు మరింత ఆత్మవిశ్వాసంతో మంచి మార్కులు సాధిస్తున్నారు. ఇదే స్ఫూర్తితోనే ఈ స్కూల్లో ఒకేషనల్ విద్యా బోధన జరుగుతుంది. ఇక్కడ చదువుకున్న వారిలో చాలా మంది ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నారు.
హరిత పాఠశాల..
లాలాపేట స్కూల్ క్యాంపస్లో పచ్చదనం పెంచేందుకు హెడ్మాస్టర్ ఎంతో కృషి చేస్తున్నారు. ఉన్న కొద్ది స్థలంలోనే ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు పెట్టారు. వాటి లాభాలు తెలుసుకుని రోజూ విద్యార్థులు ఆ మొక్కలను
సంరక్షిస్తున్నారు.
ఇంగ్లిష్ మీడియం..సంతోషకరం
2015లో స్కూల్ హెడ్మాస్టర్గా వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడ తెలుగు, ఇంగ్లిష్ మీడియం తరగతులు సమాంతరంగా సాగుతున్నాయి. పదేండ్ల నుంచి ఇంగ్లిష్ మీడియంపై అన్ని వర్గాల ప్రజలు అవగాహన పెంచుకున్నారు. విద్యార్థులంతా అధిక సంఖ్యలో ఇంగ్లిష్ మీడియంనే ఎంపిక చేసుకుంటున్నారు. యువత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇంగ్లిష్ మీడియంను అందరూ స్వాగతిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ప్రతాప్రెడ్డి, హెడ్ మాస్టర్, లాలాపేట్ ప్రభుత్వ పాఠశాల