మేడ్చల్, అక్టోబర్ 5 ( నమస్తే తెలంగాణ); 2001లో టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటున్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో గులాబీ బాస్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో పలుమార్లు జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ తన ప్రసంగంతో ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమ నేత ఎలాంటి పిలుపునిచ్చినా శంభీపూర్ రాజు స్వచ్ఛందంగా జనసమీకరణ చేసి విజయవంతం చేశారు. గులాబీ దళపతి కేసీఆర్ స్ఫూర్తితో ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారు. కేసీఆర్ అంటే శంభీపూర్ రాజుకు ఎంతో అభిమానం ఉన్నది.
నాటి నుంచి నేటి వరకు ఎన్నికలేవైనా గులాబీ పార్టీని గెలిపిస్తూ కేసీఆర్కు కానుకగా అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన శంభీపూర్ రాజుకు ముఖ్యమంత్రికి నమ్మిన బంటులా ఉంటూ.. ప్రజల మద్దతుతో అంచెలంచెలుగా ఎదిగి నేడు గులాబీ పార్టీకి మేడ్చల్ జిల్లాను, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ(బీఆర్ఎస్)ని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ (భారత్ రాష్ట్ర సమితి) దేశ వ్యాప్తంగా అభివృద్ధి చెందేలా, ఇక్కడి పథకాలు దేశ వ్యాప్తంగా అమలయ్యేలా కృషి చేస్తానని శంభీపూర్ పేర్కొన్నారు.
దేశమంతా.. సంక్షేమం
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరిస్తాయి. తద్వారా పేదరికం రూపుమాసిపోతుంది. ఇప్పటికే తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రిగా ఉంటే దేశమంతా పేద ప్రజలు ఆనందంగా ఉంటారు. -ఎంకే బద్రుద్దీన్, మైనార్టీ రాష్ట్ర నాయకుడు
అన్ని వర్గాలకు అండగా..!
దేశంలో నేటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. అన్ని వర్గాలకు అండగా నిలిచేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. ఆయనే ప్రధానిగా ఉంటే పేద, బడుగు, బలహీన వర్గాలకు సమున్నత న్యాయం దక్కుతుంది. సీఎం కేసీఆర్ దేశ్ కీ నేతగా మార్పు తీసుకురావడం ఖాయం. – ఇంతియాజ్ ఇషాక్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్