ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం ఆరోగ్యానికి హానికరం. క్రమం తప్పక వ్యాయామం చేసినా కూడా ఇది మంచిది కాదు. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర
స్థాయులను అదుపులో ఉంచుకోడానికి, ప్రతి అరగంటకూ మూడు నిమిషాలసేపు నడవాలని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. కూర్చుని పనిచేస్తున్నప్పుడు.. మధ్యమధ్యలో నడవడానికి తీసుకునే విరామాన్ని ‘యాక్టివిటీ స్నాకింగ్’ అని పిలుస్తారు. ఎక్కువసేపు అలానే కూర్చోకుండా మధ్యలో నాలుగు అడుగులు వేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
భవిష్యత్తులో కొత్త సమస్యలు తలెత్తవు కూడా. ‘టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం పెద్ద సమస్యే. ఈ ఇబ్బందికి వ్యాయామమే తిరుగులేని పరిష్కారం. అయితే దీర్ఘకాలం కూర్చునే ఉండటంవల్ల వ్యాయామం చేసినా, రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండదు’ అంటారు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన డాక్టర్ ఎలిజబెత్ రాబర్ట్సన్. కాబట్టి, కూర్చుని పనిచేసే వారు.. ప్రతి అరగంటకు ఓసారి నడవమంటూ హెచ్చరించేలా ఓ అలారం లాంటిది ఏర్పాటు చేసుకుంటే మంచిదని రాబర్ట్సన్ సలహా. అమలు చేయండి మరి.