పక్షవాతం (స్ట్రోక్) చికిత్సను 2014వ సంవత్సరం కొత్తపుంతలు తొక్కించింది. ఆ ఏడాది అధునాతనమైన చికిత్సా పద్ధతి అందుబాటులోకి వచ్చింది. అదే.. థ్రాంబెక్టమీ. జనరల్ అనెస్తీషియా అవసరం లేని సర్జరీ ఇది. కేవలం లోకల్ అనెస్తీషియాతో స్ట్రోక్ వచ్చిన 24 గంటల్లోగా థ్రాంబెక్టమీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పక్షవాతంతో పోలిస్తే గుండెపోటు నుంచి బయటపడటం చాలా సులువు. గుండె ఎక్కడ ఉంటుందో గుండెపోటు లక్షణాలు కూడా అక్కడే ఉంటాయి. కానీ మెదడులో సమస్య వల్ల తలెత్తే పక్షవాతం లక్షణాలు ఏ కాళ్లూ చేతుల్లోనో కనిపిస్తాయి. అందుకే దీన్ని తొందరగా గుర్తించలేకపోతారు. అంతేకాదు.. గుండెపోటుకు ఒక్క ఈసీజీ చూసి చికిత్సకు సిద్ధం కావొచ్చు. పక్షవాతానికి మాత్రం సీటీ ఆంజియోగ్రామ్, సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ ఆంజియోగ్రామ్, ఎంఆర్ఐ స్కాన్లు చేస్తారు. వీటిద్వారా వచ్చింది ఏ రకమైన పక్షవాతమో తెలియడం మాత్రమే కాకుండా, నాడీ కణజాలం ఎంతమేరకు ప్రభావితం అయ్యిందనే విషయం కూడా నిర్ధారణ అవుతుంది. ఇలా వైద్యులు సమస్యను పూర్తిగా గుర్తించి, తగిన చికిత్స చేస్తారు.
Stroke | శరీరంలో కణాలన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే కణ కణానికీ నిరంతరం రక్తం సరఫరా కావాలి. మెదడులోని కణాలు కూడా అంతే. ఏ కారణం చేతనైనా మెదడుకు తగినంత రక్తం అందకపోతే ఆయా కణాలు దెబ్బతిని చనిపోతాయి. ఇలా రక్తం అందకపోవడానికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్. అంటే… మెదడుకు మొత్తం నాలుగు రక్తనాళాలు వెళ్తాయి. ఇందులో రెండు రక్తనాళాలు మెదడు ఎడమవైపుకి, రెండు కుడివైపుకి వెళ్తాయి. వీటిలో ఎక్కడైనా రక్తం గడ్డకడితే అది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దాంతో మెదడుకు రక్తసరఫరా సరిగా జరగక పక్షవాతం వస్తుంది. దాదాపు 80 శాతం స్ట్రోక్ కేసులకు ఇదే కారణం. ఇక రెండో రకం హెమరేజిక్ స్ట్రోక్. ఈ రకం దానిలో రక్తనాళాల్లో ఏదైనా చిట్లిపోయి, రక్తం బయటికి రావడంతో మెదడులో కణాలు దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు వచ్చే పక్షవాతం ఇది. దాదాపు 20 శాతం పక్షవాతం కేసులకు కారణం హెమరేజిక్ స్ట్రోక్.
పక్షవాతం రావడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. మధుమేహం కూడా కారణమవుతుంది. బీపీ, మధుమేహం ఇంతకుముందైతే అరవయ్యేండ్ల వయసులో కనిపించేవి. కానీ ఇప్పుడు ముప్పైల్లోనే దాపురిస్తున్నాయి. అందుకే ఈ వయసు వాళ్లలో కూడా పక్షవాతం కనిపిస్తున్నది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా జంక్ఫుడ్కు తినడం, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్కు ఇప్పటి యువత అలవాటు పడుతున్నది. ఇవన్నీ కూడా పక్షవాతానికి కారణమయ్యేవే. మరో ముఖ్య కారణం అధిక ఒత్తిడి. కార్పొరేట్ ఉద్యోగాలు పెరిగిన తర్వాత చిన్న వయసులోనే అధిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దాంతో నలభై ఏండ్లు దాటకుండానే పక్షవాతానికి గురవుతున్నారు. ఇలాంటి జీవనశైలి కారణాలతోపాటు జన్యుపరమైన అంశాలు కూడా పక్షవాతం రావడానికి దోహదపడతాయి.
పక్షవాతానికి మరో కారణం డైసెక్షన్. దీనిలో రక్తనాళంలోని రెండు పొరలు విచ్చుకుంటాయి. సాధారణంగా రక్తనాళంలో 3 పొరలు ఉంటాయి. వీటిలో మొదటి రెండు పొరలు తెరుచుకుని అందులోకి రక్తం వెళ్తుంది. దానివల్ల పక్షవాతం వస్తుంది. ఎక్కువగా మసాజ్ చేయించుకోవడం, లాంగ్ డ్రైవ్ చేయడం, డ్రైవ్ చేస్తూ మెడ వెనక్కి తిప్పడం వల్ల రక్తనాళాలు మెలితిరిగిపోయి ఇలాంటి సమస్య రావొచ్చు. చిన్నారుల్లో గుండెజబ్బుల వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆ తర్వాత సికిల్సెల్ ఎనీమియా, మోయా-మోయా అనే వ్యాధి (దీనిలో రక్తనాళాలు సన్నగా అవుతాయి) లాంటివి చిన్నపిల్లల్లో పక్షవాతానికి కారణమవుతాయి.
మెదడులో నాడీ కణజాలానికి రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు ఆ కణాలకు పోషకాలు, ఆక్సిజన్ అందక అక్కడి కణాలు నశిస్తాయి. ఇలాంటప్పుడు ఏ నాడీ కణజాలం మన శరీరంలో ఏ పనిని నిర్వర్తిస్తుందో… ఆ కణజాలం దెబ్బతినడం వల్ల ఆయా పనులు చేయలేకపోతాం. ఉదాహరణకు కాలు, చెయ్యి కదలికలను నియంత్రించే నాడీ కణజాలానికి రక్తం అందక అది చచ్చుబడిపోతే ఇక కాలు, చెయ్యి కదిలించలేం. మాటకు సంబంధించిన నాడీ కణజాలం దెబ్బతింటే మాట పడిపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి.
నాడీకణాలు ఒకసారి చచ్చిపోతే ఇక కొత్త నాడీకణాలు ఏర్పడవు. కాబట్టి అవి నశించిపోకుండా చూసుకోవాలి. పక్షవాతం వచ్చినప్పుడు రక్త సరఫరా ఆగిపోయిన చోట ఉన్న కొన్ని కణాలు వెంటనే దెబ్బతింటాయి. నిమిష నిమిషానికీ ఇలా దెబ్బతినే కణాల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఒక నిమిషానికి ఏడు వందల కోట్ల (7 బిలియన్ల) న్యూరాన్లు చనిపోతాయి. అందుకే పక్షవాతం వచ్చినప్పుడు ప్రతీ నిమిషం కీలకమైనదే. బ్లాక్ దగ్గర ఉన్న కణాల చుట్టూ కొంతమేర ఉండే కణజాలాన్ని పెనెంబ్రా అంటారు. దీన్ని రిస్క్లో ఉన్న కణజాలంగా పరిగణిస్తారు. ఈ కణజాలం ఎంత ఎక్కువ భాగం డ్యామేజి అయితే అంత ఎక్కువ నష్టం ఉంటుంది. సమయం మించిపోతున్న కొద్దీ ఫలితం వేరుగా ఉంటుంది. రిస్క్ కణజాలం మొత్తం డ్యామేజీ అయ్యిందంటే ఇక ఏ చికిత్సా అందించలేం. అందుకే పక్షవాతం వచ్చినప్పుడు రోగిని ఎంత తొందరగా హాస్పిటల్లో చేరిస్తే అంత మంచిది.
చాలా దేశాల్లో పక్షవాతానికి త్వరగా చికిత్స అందించడానికి ప్రత్యేకమైన అంబులెన్స్ యూనిట్లు ఉంటాయి. వీటిని మొబైల్ స్ట్రోక్ యూనిట్స్ అంటారు. ఈ అంబులెన్స్లోనే సీటీ స్కాన్, డాక్టర్, నర్సు అందరూ ఉంటారు. రోగి దగ్గరికి వెళ్లగానే అదే అంబులెన్సులో సీటీ స్కాన్ చేసి, అక్కడే ఇంజెక్షన్ ఇస్తారు. ఇలాంటి యూనిట్లను హైదరాబాద్లో కూడా ప్రారంభించే ఆలోచన ఉంది. అయితే మన దగ్గరి మొబైల్ స్ట్రోక్ యూనిట్లో సీటీ స్కాన్ను ఉంచలేం. అందువల్ల రోగిని సీటీ స్కాన్ చేయించుకోమని, ఆ రిపోర్ట్స్ వాట్సాప్లో పంపించమని వైద్యులు సూచిస్తారు. ఈలోపు అంబులెన్స్ పేషెంట్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడే వెంటనే ఇంజెక్షన్ చేసి రోగిని హాస్పిటల్కు తరలిస్తారు. పైగా రోగి హాస్పిటల్ దాకా వచ్చే సమయం మిగిలిపోతుంది కూడా!
మాటలో తేడా రావడం, నత్తి, సరిగ్గా మాట్లాడలేకపోవడం, విన్నది అర్థం చేసుకోలేకపోవడం, మూతి పక్కకు వెళ్లిపోవడం (ఫేషియల్ పెరాలిసిస్), ఒకవైపు చెయ్యి, కాలు బలహీనం కావడం, ఒక కాలు లేదా ఒక చెయ్యి బలహీనం కావడం, నడిస్తే అడుగులు తడబడటం, మనుషులు ఒక్కరే ఇద్దరుగా కనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సీటీ స్కాన్ చేయించాలి. పక్షవాతం నిర్ధారణ జరిగితే చికిత్స మొదలుపెట్టాలి.
పక్షవాతానికి ఒకప్పుడు చికిత్స లేదు. కానీ గత 15 20 ఏండ్లుగా మంచి చికిత్స అందుబాటులో ఉన్నది. లక్షణాలు కనిపించిన మొదటి నాలుగున్నర గంటలలోగా హాస్పిటల్లో చేరాలి. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే శరీరంలో ఎలాంటి అవకరాలు ఏర్పడకుండా ఉంటాయి. రోగిని హాస్పిటల్లో చేర్చగానే వైద్యులు సీటీ స్కాన్ చేస్తారు. ఇందులో రక్తనాళం చిట్లి రక్తస్రావం కావడం వల్ల పక్షవాతం వచ్చిందా, లేదా బ్లాక్ వల్ల వచ్చిందా అనేది తెలుస్తుంది. రక్తస్రావం వల్ల కాకుండా బ్లాక్ వల్ల వచ్చిన ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే వెంటనే క్లాట్ కరగడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఇది టిష్యూ ప్లాస్మోజెన్ యాక్టివేటర్ (టిపిఎ) లేదా టెనెక్టిప్లేస్ ఇంజెక్షన్. ఇలా ఇంజెక్షన్ ఇవ్వడాన్ని థ్రాంబోలైటిక్ థెరపీ అంటారు. ఈ ఇంజెక్షన్ వల్ల రక్త సరఫరాకు ఆటంకంగా ఉన్న గడ్డ కరిగిపోయి రక్తనాళం తెరుచుకుంటుంది. దాంతో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. ఫలితంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాడీ కణాలకు ఆక్సిజన్ అంది, అవి మెరుగుపడతాయి. ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ రక్తనాళంలో గడ్డ కరగకుండా రక్తనాళం తెరుచుకోకపోతే, మెకానికల్ థ్రాంబెక్టమీ చేస్తారు. అంటే ఎండోవాస్కులర్ థెరపీ ద్వారా కేథటర్ పంపి, క్లాట్ తీసేస్తారు. ఇది 6 గంటలలోపు చేయాలి. కొందరిలో 24 గంటల లోపు కూడా చేయవచ్చు.
పక్షవాతం నుంచి కోలుకోవడానికి ఫిజియోథెరపీ అత్యంత ముఖ్యమైన చికిత్స. ఫిజియోథెరపీలో స్ట్రెంథెనింగ్ వ్యాయామాలు చేయిస్తారు. కండరాల్లో స్టిఫ్నెస్ పోవడానికి ఇంజెక్షన్లు ఇస్తారు. వాకింగ్ చేయిస్తారు. ఇలాంటి వాటివల్ల పక్షవాతానికి గురైన అవయవాలు తిరిగి శక్తి పుంజుకుంటాయి. వాటి పనితీరు మెరుగుపడుతుంది. థ్రాంబోలైటిక్ థెరపీ ఇంజెక్షన్లు జిల్లా స్థాయిలో అందుబాటులో ఉంటే చికిత్స అక్కడికక్కడే వెంటనే ఇవ్వొచ్చు. అలా హైదరాబాద్ వరకూ వచ్చే టైం మిగులుతుంది. రోగి కోలుకునే అవకాశాలు పెరుగుతాయి.
సాధారణంగా పక్షవాతం (స్ట్రోక్) వస్తే ప్రతి పదిమందిలో నలుగురికి ఇంజెక్షన్ అవసరమైతే, ఇద్దరికి సర్జరీ అవసరం అవుతుంది. అయితే, సర్జరీ అనగానే ఇదేదో పెద్ద కోతపెట్టి చేసే ఆపరేషన్ అని భయపడనక్కర్లేదు. కాలి రక్తనాళం ద్వారా కేథటర్ గుండా స్టెంట్ రిట్రీవర్ అనే పరికరాన్ని క్లాట్ దగ్గరికి పంపించి, దాన్ని తొలగిస్తారు. దీన్ని థ్రాంబెక్టమీ అంటారు. రోగి తొడ భాగంలో చిన్న కోత పెట్టి ఆప్టిక్ ఫైబర్ కేబుల్ను రక్తనాళం గుండా మెదడులో మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపిస్తారు. తర్వాత సున్నితమైన గొడుగు లాంటి స్టెంట్ రిట్రీవర్ను కేథటర్ గుండా పంపిస్తారు. మెదడు రక్తనాళంలో పూడిక ఉన్న చోట స్టెంట్ రిట్రీవర్ గొడుగు లాగా తెరుచుకుని అక్కడ అడ్డంగా ఉన్న గడ్డను తనలోకి లాగేసుకుంటుంది. అప్పుడు దాన్ని బయటికి లాగేస్తారు. రక్తనాళంలో ఏర్పడ్డ గడ్డ తొలగిపోవడంతో రక్త ప్రసరణ సాఫీగా కొనసాగుతుంది.
ఎంత చెట్టుకు అంత గాలి… ఇది ఒకప్పటి సామెత. ఎన్ని చెడ్డ అలవాట్లుంటే అన్ని రోగాలు.. ఇది ఇప్పటి మాట. మారిన ఆహార పద్ధతులు, చిన్న వయసులోనే దుర్వ్యసనాల బారినపడటం.. వెరసి ఎప్పుడో 60 ఏండ్లు దాటాక వచ్చే జబ్బులు ఇప్పుడు పాతికేండ్లకే వచ్చిపడుతున్నాయి. అలాంటి వ్యాధుల సరసన పోటీ పడుతున్న జబ్బుల్లో పక్షవాతం ఒకటి. చిన్నవయసులోనే పక్షవాతం బారినపడుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు, అంగవికలత్వానికి పక్షవాతం రెండో కారణంగా మారింది. అలాగని పక్షవాతం బారినపడ్డామని కుంగిపోనవసరం లేదు. త్వరగా హాస్పిటల్లో చేరితే పక్షవాతం వచ్చినా కూడా ఎప్పట్లా జీవించే వీలుంది. పక్షవాతం లక్షణాలు, చికిత్సల గురించి అవగాహన పెంచుకుని సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోవాలి.
– డాక్టర్ జి.పి.వెంకట్ చౌదరి
సీనియర్ న్యూరో
ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్.
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్.