Health Tips | మిలమిలలాడే తెల్లటి దంతాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అయితే, ఆమ్లం ఎక్కువగా ఉండే ఆహారాల ప్రభావంతో పండ్ల పైపొర ఎనామిల్ దెబ్బతింటుంది. దీంతో వయసు పెరిగేకొద్దీ పండ్లు పచ్చబడతాయి. కొన్ని ఆహారాలు, పానీయాల వల్ల కూడా దంతాలు పచ్చగా మారే ప్రమాదం ఉంది. వాటి జాబితా ఇదీ..
టీ, కాఫీలు: స్ట్రాంగ్గా ఉండే బ్లాక్ కాఫీ, టీ పండ్ల మీద మచ్చలకు కారణమవుతాయి. కాబట్టి, చాయ్ కాఫీల విషయంలో పరిమితి ఉండాలి. మరీ చిక్కగా తాగొద్దు.
కార్బొనేటెడ్ ఎనర్జీ డ్రింక్స్: ఆమ్లత్వం అధికంగా ఉండే ఈ పానీయాలు పండ్లపై మచ్చలకు కారణమవుతాయి. దంతక్షయానికీ దారితీస్తాయి.
ఊరగాయలు: ఇవి కూడా ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. పండ్ల పైపొర ఎనామిల్ను ధ్వంసం చేసి పచ్చదనానికి కారణంగా నిలుస్తాయి.
టమాటా సాస్: ఇది పండ్లపై పచ్చ రంగుకు కారణమవుతుంది. సాస్ తీసుకోవడానికి ముందు బ్రకోలీ లాంటి ఆకుకూరలు తింటే మంచిది. ఇవి పండ్ల మీద తాత్కాలిక కోటింగ్లా ఏర్పడి, పండ్లు పచ్చబడటాన్ని నివారిస్తాయి.
ద్రాక్ష, దానిమ్మ రసాలు: ఇవి కూడా పండ్ల మీద పచ్చదనానికి దారితీస్తాయి. కాబట్టి, దానిమ్మ, ద్రాక్ష జ్యూస్ తాగిన తర్వాత నోరు కడుక్కోవడం మర్చిపోవద్దు. స్ట్రాతో తాగినా మంచిదే.
మసాలా కూరలు: మసాలాలు దట్టించిన కూరలు తిన్న తర్వాత తప్పక బ్రష్ చేసుకోవాలి. లేదంటే పండ్లు పచ్చ
బడతాయి.
బీట్రూట్: గాఢమైన ఎరుపు రంగులో ఉండే బీట్రూట్ కూడా పండ్ల పచ్చరంగుకు కారణమవుతుంది. నిజానికి, బీట్రూట్ దుంపలు అత్యంత ఆరోగ్యకరమైన కూరగాయలు. అందువల్ల వీటిని తీసుకున్న తర్వాత, పండ్లు తోముకుంటే సరిపోతుంది.