పలకరింపులో ప్రేమ ఉంది. కుశల ప్రశ్నలో మమకారం తొంగిచూస్తుంది. తీపి మాట.. అనుబంధాల కోట కడుతుంది. కాబట్టి, పసిబిడ్డలతో మాట్లాడుతూనే ఉండండి. దగ్గరితనం పెరిగేకొద్దీ బోసినవ్వులతో స్పందిస్తారు. కేరింతలతో జవాబులిస్తారు. పుట్టినప్పటి నుంచి మూడేండ్లు నిండేవరకూ పిల్లలతో ఎంత మాట్లాడితే అంత మంచిదని, మెదడు వికాసానికి ఆ పదాలే ఔషధాలై పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
పిల్లల కోసం కష్టపడని ప్రాణి అంటూ ఉండదు. జంతుజాలం విషయంలో ఆ తపన ఆహారానికే పరిమితం. కానీ మనుషులకు మాత్రం మమకారానికి పరిధి ఉండదు. బిడ్డకు సకల సౌకర్యాలూ సమకూర్చాలని ఆశపడతారు. స్థిర చరాస్తులు సంపాదించి పెట్టాలని ఆరాటపడతారు. బిడ్డ గలగలా మాట్లాడుతూ, బిరబిరా తిరుగుతూ సందడి చేయాలని తాపత్రయపడతారు. అందులోనూ మాట వరాల మూట. మెదడులో సరైన ఎదుగుదల ఉంటేనే.. పిల్లలు సాధారణ జీవనాన్ని గడపగలరు. లేకపోతే బుద్ధి వికసించదు. క్రమంగా మానసిక అనారోగ్యం బారినపడతారు. అదే జరిగితే, బిడ్డ పరిస్థితిని చూసి తల్లిదండ్రులు జీవితాంతం కుమిలిపోవాల్సి వస్తుంది. కొంతముందుచూపుతో వ్యవహరిస్తే.. ఈ గండాన్ని తప్పించవచ్చు. పిల్లల మాటల్ని బట్టి వాళ్ల వికాసాన్ని అర్థంచేసుకోవచ్చు. మూడేండ్లు వచ్చేవరకు వారితో తరచూ సంభాషిస్తూ ఉండాలి. వాళ్లకంటూ సమయం కేటాయించాలి.
అవును. తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచే శిశువు శబ్దాలను వినగలదు. మాతృమూర్తి గర్భం దాల్చిన పదహారు వారాల్లోనే బిడ్డ వినికిడి వ్యవస్థ వృద్ధి చెందడం మొదలవుతుంది. ఇరవై అయిదు వారాల్లో పూర్తి స్థాయిలో చెవులు ఏర్పడతాయి. ఆ ప్రకారంగా, శిశువులో పరిపూర్ణ ఆకృతి ధరించే తొలి జ్ఞానేంద్రియం.. చెవులే. కాబట్టే, గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లి మాట్లాడే ప్రతి మాటనూ బిడ్డ వినగలదు, అర్థం చేసుకోగలదు. అమ్మ భావోద్వేగ పూరిత సంభాషణనూ గ్రహించగలదు. అందుకే, గర్భిణులు ఏడవకూడదని అంటారు. తీవ్ర ఉద్వేగానికి గురి కాకూడదనీ హెచ్చరిస్తారు. పొట్టలోంచే తల్లి స్వరానికి అలవాటై ఉండటం వల్ల.. పుట్టిన వెనువెంటనే తల్లి గొంతుకను గుర్తిస్తారు నవజాత శిశువులు. ఎంత మంది ఊరుకోబెట్టినా ఏడుపు ఆపని పసికందు.. తల్లి పలకరింపుతో బోసినవ్వులు చిందిస్తుంది. కేరింతలు కొడుతుంది.
మాటే మంత్రం
తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బిడ్డ కోసం వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు.. ఇలా ఎవరో ఒకరు శిశువును మాట్లాడించేవారు. ఎంతోకొంతసేపు ఆడించేవారు. ప్రస్తుతం అన్నీ చిన్న కుటుంబాలే. దీనికి తోడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చేశాయి. చాలా సందర్భాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో నెలల వయసు పిల్లలను కూడా డే-కేర్ సెంటర్స్లో చేర్పిస్తున్నారు. శిశువులతో మాట్లాడేంత సమయం ఎవరికీ ఉండటం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా.. పిల్లలు మారాం చేసినా, తినకపోయినా చేతిలో ఫోనో, ట్యాబో పెట్టేస్తున్నారు. దీనివల్ల పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ‘ఇంటరాక్షన్’ తగ్గిపోతున్నది. ఫలితంగా, పిల్లల మెదడులో ఎదుగుదల మందగించే ప్రమాదం ఉంది.
ఎలా మాట్లాడాలి?
ఆటలతో, మాటలతో పిల్లల హావభావాలను గమనించవచ్చు. మనోభావాలను తెలుసుకోవచ్చు. వాళ్లు మన మాటలనూ, చేతలనూ అర్థం చేసుకుంటారు. అటూఇటూ కళ్లు తిప్పడం, చురుకుగా కదలడం, లేత నవ్వులు నవ్వడం, కాళ్లూచేతులు ఊపడం.. ఇలా రకరకాలుగా స్పందిస్తారు. ఈ క్రమంలో పిల్లల మానసిక పరిపక్వత పెరుగుతుంది. కండరాలు బలపడతాయి. సాధారణంగా పసిబిడ్డలు శబ్దాల రూపంలోనో.. ఏడుపు ద్వారానో.. మనసులోని మాట చెబుతారు. మూత్రం వచ్చినప్పుడు, పొట్టలో కానీ మరెక్కడైనా కానీ నొప్పిగా అనిపించినప్పుడు, ఆకలేసినప్పుడు, కొత్తవాళ్లు కనిపించినప్పుడు.. ‘కేర్కేర్’ అంటూ అవసరాన్ని, భయాన్ని వ్యక్తపరుస్తారు. సెల్ఫోన్ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే.. అవసరమైన యాప్స్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే, నవజాత శిశువుతో మనం సంభాషణల ద్వారా అనుసంధానం కావాలి. మాట అంత శక్తిమంతమైంది! మనం మాట్లాడే ఒక్కో పదం, బిడ్డ మెదడులో ఒక్కో కనెక్షన్ను ఏర్పరుస్తుంది. దీన్నే వైద్యపరిభాషలో ‘సినాప్సిస్’ అంటారు. మెదడులో అనేకానేక న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్కు, న్యూరాన్కు మధ్య కనెక్షన్స్ ఉంటేనే మెదడు పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మనం మాట్లాడటం వల్లే సినాప్సిస్ బలపడతాయి.
మాట్లాడకపోతే..
శిశువులకు సంగీతం వినిపించడం వల్ల వారిలో గణిత సామర్థ్యం పెరుగుతుందని, భాషా నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతరులతో పోలిస్తే సంగీత సాధకుల మెదడు ఎదుగుదలలో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. పేద కుటుంబాల్లోని పిల్లల కంటే సంపన్నుల పిల్లల్లోనే మెదడు ఎదుగుదల ఎక్కువగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. సంపన్న కుటుంబాల్లో మనుగడ కోసం పోరాటం ఉండదు. కన్నవారు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ఎక్కువసేపు మాట్లాడతారు. పేదల పరిస్థితి వేరు. పనికి వెళ్లకపోతే పూట గడవదు. దీంతో పసిబిడ్డలతో ఓపిగ్గా సంభాషించేంత తీరిక ఉండదు. ఆ కారణంగానే.. సంపన్నుల పిల్లల మెదడులో ఎదుగుదల వేగవంతంగా ఉంటుంది. సంపన్నుల పిల్లల కంటే పేదల పిల్లలు మూడుకోట్ల సంభాషణలు వెనుకబడి ఉన్నట్టు నిపుణులు గుర్తించారు.
పోషకాలతో సమానం
నిన్నమొన్నటి వరకూ పోషకాల లోపం వల్లనే పిల్లల మెదడు ఎదుగుదలలో లోపం కనిపిస్తుందని భావించేవారు. తాజా అధ్యయనం మాత్రం, సంభాషణను కూడా ఓ కారణంగా తేల్చింది. అందుకే, పిల్లలకు పోషకాహారంతో పాటు మాటల మిఠాయిలు అందించాలి. అందులోనూ మూడు సంవత్సరాలు వచ్చేవరకూ.. ఎంత ఎక్కువ సంభాషిస్తే అంత వేగంగా మెదడు వృద్ధి చెందుతుంది. ప్రత్యేకించి.. ఈ దశలో నేర్చుకునే శక్తి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి, మాట్లాడండి, మాట్లాడండి.. మాట్లాడుతూనే ఉండండి. ఎందుకంటే, మాటకు జీవితాన్నిచ్చే శక్తి ఉంది.
జాగ్రత్త.. జాగ్రత్త!
– డాక్టర్ భుజంగరావు
చైర్మన్, కిమ్స్ ఫౌండేషన్
అండ్ రిసెర్చ్ సెంటర్
– డాక్టర్ భాస్కర్రావు
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
కిమ్స్ హాస్పిటల్స్, హైదరాబాద్
– మహేశ్వర్రావు బండారి