Tea | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజును ఒక కప్పు టీతో ప్రారంభిస్తారు. భారతీయుల జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచింది మొదలు సాయంత్రపు చిట్చాట్ల వరకు టీ దైనందిన జీవితంలో భాగమైపోయింది. అయితే ఇప్పుడు భారతీయుల అభిమాన పానీయంగా మారిన టీ అసలు పుట్టింది మాత్రం భారత్లో కాదు. వేల సంవత్సరాల క్రితమే చైనాలో టీ చరిత్ర ప్రారంభమైంది. టీ ఆవిష్కరణకు సంబంధించిన కథ దాదాపు 5 వేల సంవత్సరాల క్రితం చైనాలోని యున్నాన్ ప్రాంతంతో ముడిపడి ఉంది. చారిత్రక కథనాల ప్రకారం చైనా చక్రవర్తి షెన్ నాంగ్ ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా పక్కనే నీరు మరుగుతుండేది. ఆ సమయంలో చెట్టు ఆకులు కొన్ని ఆ వేడి నీటిలో పడిపోయాయి. ఆ నీటిని రుచి చూసిన చక్రవర్తి దాని ప్రత్యేక రుచి, ఉల్లాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడట. దాన్నే ప్రపంచంలో తొలి టీ కప్పుగా భావిస్తారు.
తర్వాత అనేక శతాబ్దాల పాటు చైనాలో టీని కేవలం పానీయంగా మాత్రమే కాకుండా ఔషధంగా కూడా భావించేవారు. టీ తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని, శరీరానికి శక్తి వస్తుందని అక్కడి ప్రజలు నమ్మేవారు. క్రమంగా టీ వారి దైనందిన జీవితంలో భాగమై, ఆ తర్వాత ప్రత్యేక కళారూపంగా కూడా మారింది. చైనాలో సాధారణంగా టీని పాలు, చక్కెర లేకుండా స్వచ్ఛమైన రూపంలోనే తాగుతారు. అలా తాగితే టీ ఆకుల సహజ రుచి పూర్తిగా ఆస్వాదించవచ్చని భావిస్తారు. చైనా వ్యాపారుల ద్వారా టీ యూరప్కు చేరింది. 17వ శతాబ్దానికి బ్రిటిష్ ప్రజలు టీకి బాగా అలవాటు పడ్డారు. అయితే టీ వ్యాపారంపై పూర్తిగా చైనాకే ఆధిపత్యం ఉండటంతో బ్రిటన్ కొత్త మార్గాలను వెతకడం ప్రారంభించింది. అదే సమయంలో భారత్లో టీ సాగు ప్రారంభమైంది.
మొదట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చైనా టీ విత్తనాలను భారత్లో నాటే ప్రయత్నం చేసింది. కానీ అసలు మలుపు అస్సాంలో సహజంగా పెరుగుతున్న అడవి టీ మొక్కలను గుర్తించిన తర్వాత వచ్చింది. ఈ టీ రకం చైనా టీ మొక్కలకంటే భిన్నంగా ఉండేది. దీని ఆకులు పెద్దగా ఉండటంతో పాటు చక్కని రుచిని ఇస్తుండేవి. బ్లాక్ టీ తయారికి ఇది ఎంతో అనుకూలంగా మారింది. ఆ తర్వాత అస్సాం, డార్జిలింగ్, నీలగిరి వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో టీ తోటలు ఏర్పడ్డాయి. అయితే ప్రారంభంలో భారత్లో పండించిన టీ ఆకులను ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేసేవారు. భారతీయులు అప్పట్లో పెద్దగా టీ తాగేవారు కాదు. 20వ శతాబ్దంలో జరిగిన ప్రచార కార్యక్రమాల తర్వాతే టీ భారతీయ ఇళ్లలో సాధారణ పానీయంగా మారింది. టీని భారత్ పూర్తిగా కొత్త రూపంలో మార్చింది. చైనాలో స్వచ్ఛమైన టీకి ప్రాధాన్యం ఇస్తే, భారతీయులు అందులో పాలు, చక్కెర, అల్లం, యాలకులు, లవంగాలు వంటి మసాలాలు కలిపారు. అలా మసాలా చాయ్ అనే ప్రత్యేక రుచికరమైన పానీయం రూపుదిద్దుకుంది.
చైనా టీ సాధారణంగా మృదువైన, సున్నితమైన రుచితో ఉండి నెమ్మదిగా ఆస్వాదించేందుకు అనుకూలంగా ఉంటుంది. భారతీయ టీ మాత్రం ఘాటుగా, బలమైన రుచితో వెంటనే ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉంటుంది. టీ తాగే విధానంలో కూడా రెండు దేశాల మధ్య తేడా కనిపిస్తుంది. చైనాలో టీ తాగడం ప్రశాంతత, ధ్యానంతో ముడిపడి ఉంటే, భారత్లో టీ అనేది సంభాషణలతో ముడిపడి ఉంటుంది. కుటుంబ చర్చలు, ఆఫీస్ విరామాలు, రైలు ప్రయాణాలు, స్నేహితుల కబుర్లు అన్నింటిలోనూ చాయ్ ప్రత్యేక భాగంగా మారిపోయింది. టీ చైనాలో పుట్టినా, దానికి కొత్త వ్యక్తిత్వాన్ని ఇచ్చింది మాత్రం భారత్ అనే చెప్పాలి. వేల సంవత్సరాల క్రితం చైనా పర్వతాల్లో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.