మన జీర్ణ వ్యవస్థలో చివరగా ఉండే భాగాన్ని కోలన్ అనీ, ఈ భాగానికి వచ్చే క్యాన్సర్ను కోలన్ క్యాన్సర్ అని అంటారు. ఆహారంలోని పోషక పదార్థాలను చిన్నపేగులు గ్రహిస్తే, నీటిని పొటాషియం సాల్టేట్లు, కొవ్వులో కరిగే విటమిన్లను పెద్దపేగు గ్రహించి వ్యర్థపదార్థాలను బయటికి పంపిస్తుంది. పెద్దపేగు చతురస్రాకారంలో ఉంటుంది. దీనిని నాలుగు భాగాలుగా విభజించారు. వాటిలో చివర ఉండేదే మలద్వారం.
పెద్దపేగు చివరి భాగంలో పాలిప్స్ (కణుతులు) ఏర్పడి, వాటిలో కణాలు అపరిమితంగా పెరగడం వల్ల ఈ క్యాన్సర్కు దారితీస్తుంది. ఈ కణుతులు కొంతకాలం ఏమీ చేయకుండా అలాగే ఉన్నా క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి కోలనోస్కోపిలో వీటిని గమనిస్తే తీసివేయించుకోవటం మంచిది. మిగతా క్యాన్సర్లలాగే ఈ క్యాన్సర్కు కూడా కచ్చితమైన కారణాలు తెలియకపోయినా జీన్ మ్యూటేషన్స్, లావుగా ఉన్నవారిలో, రెడ్మీట్ (మాంసం) ఎక్కువగా తీసుకునే వారిలో, ఫైబర్ తక్కువగా తీసుకునేవారిలో, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు, ఇతర క్యాన్సర్లకు తీసుకునే రేడియేషన్.. వంటివి కొంతవరకు కారణం కావచ్చు.
అభివృద్ధి చెందిన దేశాలలోనే ఈ రకమైన క్యాన్సర్ ఎక్కువ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పశ్చిమ యూరప్లో ఎక్కువగా ఉంటుంది. ఆసియా దేశాలలో, ఆఫ్రికాలో కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. అయినా మన దేశం నుంచి ఇంగ్లండ్, అమెరికా దేశాలకు వెళ్లేవారిలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నది. కోలన్ చివరి భాగం మలద్వారానికి కొంచెం పైన రెక్టయేకు సంబంధించిన కోలోరెక్టల్ క్యాన్సర్ మన దేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ, పురు షులు ఇద్దరిలోనూ కనినిపించే ఈ క్యాన్సర్ 60 ఏళ్లు, ఆ పైబడిన వారికి మరీ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది.
ఈ క్యాన్సర్ లక్షణాలను అశ్రద్ధ చేస్తే కాలేయానికి
పాకే (మెటాస్టాసిస్) ప్రమాదం ఎక్కువ. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అజీర్తి, విరేచనాలు అవుతూ ఉండటం.. అప్పుడప్పుడు జరిగేదే కానీ, అకస్మాత్తుగా మన జీర్ణ వ్యవస్థలో మార్పులు కనిపించి, ఏమి చేసినా తగ్గకపోగా, ఇంకా ఎక్కువవుతున్నట్లు గమనిస్తే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఈ క్యాన్సర్ను నిర్ధారించడానికి డాక్టర్లు ముందుగా కుటుంబ చరిత్ర, ప్రత్యక్షంగా చూడటం వంటివి చేశాక కొలనోస్కోపి, బేరియమ్ ఎనీమా ఎక్స్రే చేస్తారు. కొలనోస్కోపి అంటే ఒక సన్నని గొట్టాన్ని మలద్వారంలో పెట్టి కెమెరా సహాయంతో పాలిప్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తారు.
కణుతులు ఏమైనా కనబడితే తొలగించి బయాప్సీ పరీక్షలకు పంపుతారు. మైక్రోస్కోప్ సహాయంతో ఆ కణాలు క్యాన్సర్ కణాలా? కాదా? అని తేల్చుకుంటారు. బేరియమ్ ఎనీమా ఎక్స్రే పరీక్షలు బేరియమ్ మింగించి పెద్దపేగుకు చేరుకున్నాక ఎక్స్రే తీసి చూస్తారు. కణుతులు ఉంటే ఈ ఎక్స్రేలో ఆ ప్రదేశం నల్లగా కనిపిస్తుంది. బయాప్సీలో క్యాన్సర్ కణాలు అని తేలితే స్టేజ్ తెలుసుకోవటానికి మిగతా పరీక్షలు చేస్తారు. ఛాతి ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సీటీస్కాన్, సీఈఏ అవసరమైతే పెట్ సీటీస్కాన్ పరీక్షలు చేయడం ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నది అనే నిర్ధారణకు రావచ్చు.
నివారణ: 50 ఏళ్ళు పైబడినవారు ఒకసారి మలపరీక్ష (యఫ్.ఒ.బి.టి.), డాక్టర్ సలహా మేరకు సిగ్మాయిడోస్కోపి, కొలనోస్కోపి వంటి పరీక్షలు చేయించుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవర్చుకుంటే కొంతవరకు క్యాన్సర్ను దూరంగా ఉంచవచ్చు.
మలంలో రక్తం పడటం పైల్స్ వంటి సమస్యల్లో కూడా సాధారణమే అయినా, ఎప్పుడూ ఆ సమస్యే అనే భావించకుండా ఒక్కసారి మలద్వారం, రెక్టమ్ను పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపి లేక వీటితోపాటు పెద్దపేగును మొత్తంగా చూసే కొలనోస్కోపి, ఇంకా డాక్టర్ సలహా మేరకు ఇతర పరీక్షలు చేయించుకుంటే మంచిది. అంతేగాని వేడిచేసింది అనీ, లేదా పైల్స్ వంటి సమస్య అయి ఉండవచ్చులే అనీ ఎవరికి వారు సొంత వైద్యం చేసుకుంటే.. ఉన్న సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది.
క్యాన్సర్ను ఆలస్యంగా గుర్తించినట్లయితే, ముఖ్యంగా ఎడమవైపు కోలన్ క్యాన్సర్లో కీమోథెరపీ, రేడియేషన్ ముందుగా ఇచ్చి, తరువాత సర్జరీ చేస్తారు. క్యాన్సర్ను చివరిదశలో గుర్తించినా మోనోక్లోనల్ వంటి మందుల ద్వారా రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
98480 11421