న్యూఢిల్లీ : పిల్లలు, యువత, పెద్దలు సహా అన్ని వయసుల వారూ అరటి పండ్లను ఇష్టంగా తింటారు. పొటాషియం, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉండే అరటి పండు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒకటి రెండుకు మించకుండా అరటి పండ్లు తీసుకుంటేనే ఈ ఫలితాలు చేకూరతాయని సూచిస్తున్నారు. ప్రతి రోజూ మితంగా అరటి పండ్లు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
బరువు నియంత్రణ : అరటి పండు క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక్కో పండులో వంద క్యాలరీల శక్తి ఉండగా ఫైబర్, ప్రొటీన్లతో కడుపు నిండిన భావనతో ఎక్కవు క్యాలరీల ఆహారం తీసుకోకుండా కంట్రోల్ చేస్తాయి.
ఎనర్జీ లెవెల్స్ మెరుగుదల : అరటి పండ్లతో నిస్సత్తువ, నీరసం మటుమాయమై శరీరం శక్తివంతమవుతుంది. రోజంతా చలాకీగా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్తో పోలిస్తే అరటి పండ్లు తక్షణ శక్తిని అందిస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
మేని సౌందర్యం : అరటి పండ్లలో ఉండే మాంగనీస్తో కొల్లాజెన్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో చర్మంపై ముడతలు, డ్రై స్కిన్ వంటి చర్మ సంబంధిత సమస్యలు దరిచేరవు
గుండె ఆరోగ్యం పదిలం : బనానాలో ఉండే పొటాషియంతో రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. బీపీ నియంత్రణలో ఉండటం ద్వారా హృద్రోగాలను నియంత్రించవచ్చు. రోజూ ఒక అరటి పండు తీసుకుంటే హృద్రోగ ముప్పు 27 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
మెరుగైన కంటి చూపు : నిత్యం అరటి పండు తీసుకుంటే కంటి సమస్యలు దూరమవుతాయి. కండ్లను కాపాడే విటమిన్ ఏ అరటి పండ్లలో పుష్కలంగా ఉంటుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది.