కొత్త ఏడాదిని చిన్నచిన్న జీవనశైలి మార్పులతో సరికొత్తగా ప్రారంభించండి.శరీరం ఆరోగ్యం గా ఉంటేనే మనసూ చురుగ్గా ఉంటుంది. ఆలోచనలు పాజిటివ్గా సాగుతాయి.
వారానికి నాలుగు రోజులు తాజా కూరగాయలను ఉడికించకుండా తినండి. నీళ్లలో నానబెట్టిన గుప్పెడు గింజలు, మొలకలతోపాటు పండ్లను తీసుకోండి.
కూరగాయలు, పండ్లతో చేసిన స్మూతీ వారానికి ఒకసారి అయినా తాగండి. అల్పాహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు ఉండేలా చూసుకోండి.
అల్పాహారం తర్వాత మూడు గంటల విరామంతో మధ్యాహ్న భోజనం ముగించండి. దీనివల్ల తేలికగా జీర్ణం అవుతుంది. శరీరాన్ని శుభ్రం చేయడంలో ముఖ్యపాత్ర పోషించే ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు తగిన మోతాదులో విడుదల అవుతాయి. జీర్ణ వ్యవస్థకు తగినంత విశ్రాంతి కూడా లభిస్తుంది.
రెండు భోజనాల మధ్య నాలుగు గంటలకంటే ఎక్కువ విరామం ఇవ్వొద్దు. ఆ వ్యవధి ఎక్కువైతే పొట్టలో ఆమ్లాలు భారీగా విడుదల అవుతాయి. శరీరం ఆమ్ల యుతంగా మారిపోతుంది. దీంతో బరువుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
..అంతేకాదు జీర్ణాశయంలో విడుదలయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్య కారణంగా పొట్టకు రక్షణగా ఉండే మ్యూకస్ పొర, జీర్ణ ప్రకియలో పాల్గొనే ఎంజైములు దెబ్బతింటాయి. ఇది జీర్ణ వ్యవస్థ సమస్యలకు అంటుకడుతుంది.
జీర్ణక్రియ నోటి నుంచే మొదలవుతుంది. కాబట్టి, ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఎంత బాగా నమిలితే మన పొట్ట, పేగులు అంత పరిశుభ్రంగా ఉంటాయి. ఇది వ్యర్థాల పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది.
మితిమీరి మద్యం తాగితే కనుక.. కాలేయం వ్యర్థాలను బయటికి పంపే పనిమీద మాత్రమే దృష్టి పెట్టాల్సి వస్తుంది.
ఆల్కహాల్ వల్ల శరీరం ఆమ్లయుతం అవుతుంది. జీవక్రియలు కుంటుపడతాయి. ఈ మార్పు వివిధ రోగాలకు దారితీస్తుంది.
రోజూ అరగంటైనా వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఒంట్లో పేరుకుపోయిన టాక్సిన్లు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతాయి. శరీరం శుభ్రమవుతుంది. రోజూ 10వేల అడుగులైనా వేయాలి.
అప్పుడప్పుడూ ఉపవాసం ఉండటమూ మంచిదే. దీనివల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. శరీరం తనకు తాను మరమ్మతు చేసుకునేందుకు తగిన అవకాశం లభిస్తుంది.