ధూమపానం అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఇది వారి ఆరోగ్యానికే కాకుండా.. తర్వాతి తరం ఆరోగ్యానికి కూడా ‘పొగ’ బెడుతుంది. పిల్లల జీవక్రియ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, తండ్రి తీసుకునే నికోటిన్.. పిల్లల్లో మధుమేహం, కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటాక్రజ్ శాస్త్రవేత్తలు తాజాగా చేపట్టిన అధ్యయనం ఈ విషయాన్ని బయటపెట్టింది. నిజానికి గర్భిణుల ధూమపానం అలవాటు.. గర్భస్థ శిశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిసిందే! కానీ, తండ్రి ఆరోగ్యం కూడా పుట్టబోయే బిడ్డపై అంతే ప్రభావాన్ని చూపుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తున్నది.
తండ్రి సిగరెట్ తాగడం వల్ల వారి పిల్లల శరీరంలో చక్కెరను ప్రాసెస్ చేసే విధానం మారిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఫలితంగా, రక్తంలో చక్కెర స్థాయులు అసమతుల్యంగా మారుతాయనీ, భవిష్యత్తులో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణాలను వివరిస్తూ.. పురుషుల శుక్రకణాల జన్యువుల మీద నికోటిన్ ప్రభావం చూపుతుందనీ, తద్వారా ఆ మార్పులు పిల్లలకు సంక్రమించి, వారి జీవక్రియను దెబ్బతీస్తాయని తాజా పరిశోధన తేల్చింది.
ఈ ప్రభావాలు మధుమేహంతోపాటు పిల్లల్లో కాలేయ పనితీరు మందగించడం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలకూ దారితీస్తుందని సదరు స్టడీ పేర్కొన్నది. తండ్రి ధూమపానం వల్ల లింగభేదం లేకుండా.. ఆడ, మగ పిల్లలిద్దరూ ప్రభావితమవుతారట. అయితే, వారిలో కనిపించే ఇన్సులిన్ స్థాయుల మార్పులు వేర్వేరుగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి, సంతానం కోసం ప్లాన్ చేసుకునే పురుషులు.. కొన్ని నెలల ముందే ధూమపానాన్ని మానేయాలని సూచిస్తున్నారు. దానివల్ల పిల్లలకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.